ఈసారి ఐటీ జాబ్స్‌  60 వేలు మాత్రమే: వెల్లడించిన నాస్కామ్​

ఈసారి ఐటీ జాబ్స్‌  60 వేలు మాత్రమే: వెల్లడించిన నాస్కామ్​

న్యూఢిల్లీ: టెక్నాలజీ పరిశ్రమ 2023–-24 ఆర్థిక సంవత్సరంలో 60 వేల కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 54.30 లక్షలకు చేరుకుంటుంది. ఈ విషయాన్ని నేషనల్​అసోసియేషన్​ ఆఫ్​ సాఫ్ట్​వేర్​ అండ్​ సర్వీస్ ​కంపెనీస్​(నాస్కామ్​) వెల్లడించింది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం సృష్టించిన 2.7 లక్షల ఉద్యోగాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. యునైటెడ్ స్టేట్స్,  ఐరోపాలోని కీలక మార్కెట్లలో ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ పరిశ్రమ డిమాండ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. దీంతో ఉద్యోగాల సంఖ్య తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

250 -బిలియన్ డాలర్ల విలువైన సేవల పరిశ్రమ కంపెనీలు ఉత్తర అమెరికా,  యూరప్ వంటి మార్కెట్ల నుంచి 60–-80 శాతానికి పైగా ఆదాయాన్ని పొందుతాయి. అక్కడి మార్కెట్లలో ఇబ్బందులు ఉన్నాయి. "కరోనా సంవత్సరంలో చాలా ఎక్కువ నియామకాలు జరిగాయి. ఇప్పుడు పరిశ్రమలో కొంత కుదింపు ఉంటుందని మేం అనుకుంటున్నాం.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, క్లౌడ్, సైబర్‌‌‌‌సెక్యూరిటీ మొదలైన ఉద్యోగాలకు చాలా డిమాండ్​ ఉంది”అని నాస్కామ్​  ప్రెసిడెంట్​ దేవయాని ఘోష్​  అన్నారు.  

నైపుణ్యాలకు పెద్దపీట

 పరిశ్రమ ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి 60-–00 గంటలను నైపుణ్యాల కల్పనకు కేటాయించడానికి కట్టుబడి ఉందని నాస్కామ్​ తెలిపింది. దాదాపు 6.5 లక్షల మంది ఉద్యోగులు కొత్త టెక్నాలజీపై శిక్షణ పొందుతున్నారని వెల్లడించింది. వ్యక్తులకు నైపుణ్యం కల్పించగల సామర్థ్యం కంటే టెక్నాలజీల్లో మార్పు చాలా వేగంగా జరుగుతోందని ఘోష్ అన్నారు.  ఈ అంతరాన్ని ఎలా భర్తీ చేయడం పరిశ్రమ ఎదుర్కొనే అతిపెద్ద సవాలని ఆమె అభిప్రాయపడ్డారు.

చాలా దేశాల్లో లేఆఫ్​లు భారీగా ఉంటున్నప్పటికీ, ఇండియాలో ఉద్యోగ కోతలు చాలా తక్కువగానే ఉంటాయని ఘోష్​ స్పష్టం చేశారు.  ఏఐ వల్ల కచ్చితంగా ఉద్యోగాలలో కొంత తగ్గుదల ఉంటుంది కానీ చాలా కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని అన్నారు. ఉద్యోగ నష్టాల గురించి ఆలోచించడం కాకుండా కొత్తతరం ఉద్యోగాల కోసం టెకీలను వేగంగా సిద్ధం చేయాలని ఆమె కంపెనీలకు సూచించారు. 2024 లో ఐటీ పరిశ్రమ 3.8 శాతం వృద్ధి చెందుతుందని ఈ  సంఘం తెలిపింది. మార్కెట్ 250 బిలియన్​ దాటుతుందని వెల్లడించింది.