- ఎన్డీయే 20 ఏండ్లు పాలించినా బిహార్పేద రాష్ట్రంగానే ఉంటది
- అవినీతి నాయకులను బీజేపీ కాపాడుతున్నదని ఫైర్
పాట్నా: రాష్ట్రంలో ఎన్డీయే గెలిచినా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కాలేరని మహాగఠ్ బంధన్ సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అన్నారు. ఆయనను బీజేపీ, గుజరాత్కు చెందిన ఇద్దరు వ్యక్తులు (ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా) హైజాక్ చేశారని వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరే బిహార్ను కంట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సహర్సా జిల్లాలోని సిమ్రి భక్తియార్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వీయాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎలక్షన్స్ తర్వాత ఎన్నికైన శాసనసభ్యులు బిహార్ సీఎంను నిర్ణయిస్తారని అమిత్షా స్పష్టం చేశారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నితీశ్ కుమార్ను సీఎంను చేయరు” అని తెలిపారు. ఈ ఎన్నికల్లో బయటి వ్యక్తికి కాకుండా.. బిహారీకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతున్న నాయకులు, క్రిమినల్స్ను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కాపాడుతున్నదని ఆరోపించారు.
‘‘నితీశ్ కుమార్ సర్కారు హయాంలో జరిగిన 55 కుంభకోణాల గురించి ప్రధాని మోదీనే వెల్లడించారు. దీనిపై ఇప్పటివరకూ ఏమైనా చర్యలు తీసుకున్నారా? మోసాలు జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్నే జంగల్ రాజ్ అంటారు. నేరాల రేటులో బీజేపీ పరిపారిలిస్తున్న రాష్ట్రాలే ముందువరుసలో ఉన్నాయి. అక్కడ వారు ఏం చేస్తున్నారు..?’’ అని తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే అవినీతిరహిత పాలన
రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే అవినీతిరహిత పాలన అందిస్తామని తేజస్వీయాదవ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల బాధలు వింటామని, సరసమైన ధరలకే మందులు అందుబాటులో ఉంచుతామని, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ‘‘బిహార్ దయనీయ పరిస్థితిని చూస్తుంటే ఓ బిహారీగాచాలా బాధ కలుగుతున్నది. రాష్ట్రంలో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోయింది. నేరాలు ఎక్కువైపోయాయి. ఎన్డీయే సర్కారు రాష్ట్రంలో 20 ఏండ్లు, కేంద్రంలో 11 ఏండ్లు ఉన్నప్పటికీ.. తలసరి ఆదాయం అత్యల్పంగా ఉన్నది. రైతులు పేదలుగానే ఉన్నారు” అని పేర్కొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ఉసిగొల్పుతున్నారని.. అయినా మోదీకి లాలూ ప్రసాద్ యాదవ్ భయపడలేదని, తాను కూడా భయపడబోనని స్పష్టం చేశారు. అవినీతి, నేరాలు లేని, వృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించే బిహార్ను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సారి తనకు అవకాశం ఇస్తే 20 ఏండ్లలో ఎన్డీయే సర్కారు చేయలేనిది.. చేసి చూపిస్తానని అన్నారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, వృద్ధాప్య పింఛన్ను రూ. 1,100 నుంచి రూ. 1,500 కు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు కార్మికులు, కమ్యూనిటీ మొబిలైజర్ల సేవలను రెగ్యులరైజ్చేస్తామని చెప్పారు. తాము గెలిస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు.
