
- డ్రగ్స్ సేల్స్ డబ్బు హవాలా మార్గంలో నైజీరియాకు తరలింపు
- బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ఎక్స్పోర్టు పేరుతో హవాలా
- గోవాలో 80 మంది నైజీరియన్ల హవాలా రాకెట్
- టీజీ ఏఎన్బీ స్పెషల్ ఆపరేషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ కట్టిడి కోసం టీజీ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ప్రత్యేక యాక్షన్ప్లాన్రూపొందించింది. డ్రగ్ సప్లయర్లను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గోవా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్లపై నిఘా పెట్టింది. డ్రగ్స్ కస్టమర్లు, సప్లయర్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నైజీరియన్లు షెల్టర్ తీసుకుంటున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నది. డ్రగ్స్ అమ్మకాలతో వచ్చిన డబ్బును నైజీరియాకు తరలించే మార్గాలను గుర్తిస్తున్నది.
గోవాలో హవాలా నెట్వర్క్
డ్రగ్స్ అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా మారిన గోవాలో వందల సంఖ్యలో నైజీరియన్ డ్రగ్ డీలర్లు, సప్లయర్లు షెల్టర్ తీసుకుంటున్నారు. కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్ లాంటి డ్రగ్స్ను దేశ వ్యాప్తంగా సప్లయ్ చేస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బును హవాలా మార్గంలో తమ సొంత దేశానికి తరలిస్తున్నారు. ఇందుకోసం గోవాలోని పర్రాలో 80 మందికి పైగా నైజీరియన్లు హవాలా రాకెట్ నడిపిస్తున్నారు. వీరికి మహారాష్ట్ర, ఢిల్లీలోని హవాలా వ్యాపారులు పెద్ద ఎత్తున కమీషన్లు ఇస్తున్నారు.
డ్రగ్స్ విక్రయాలతో వచ్చిన డబ్బు తరలింపునకు రూ.10, 20, 50 నోట్లను వినియోగిస్తున్నారు. షిప్పింగ్ ద్వారా ఎక్స్పోర్ట్ పేరుతో హవాలా లావాదేవీలు చేస్తున్నారు. ప్రధానంగా బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. జూన్ 2న హైదరాబాద్లో పట్టుబడిన వాంటెడ్ డ్రగ్ సప్లయర్ మ్యాక్స్ నెట్వర్క్లో టీజీ ఏఎన్బీ అధికారులు హవాలా గ్యాంగ్ను గుర్తించారు. రూ.1.25 కోట్లు విలువ చేసే 550 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
కాటేజీలు, అపార్ట్మెంట్లు అడ్డాగా హవాలా
మ్యాక్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీకి చెందిన హవాలా వ్యాపారులు ఉత్తమ్ సింగ్, రాజుసింగ్, మహేందర్ ప్రజాపతిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ.50 లక్షలు సీజ్ చేశారు. గోవాలోని పర్రా, కలుంగుట్, సియోలిమ్, అంజున ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, కాటేజీలు కేంద్రంగా హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈనెల 4న స్థానిక హైలాండ్ పార్క్ అపార్ట్మెంట్, సంగీత మొబైల్ షాప్ వద్ద దాడులు చేశారు. నైజీరియాకు తరలించేందుకు వాషింగ్ మెషిన్లో ప్యాక్ చేసిన రూ.50 లక్షలు సీజ్ చేశారు.
ఇలా నైజీరియన్లు సహా డ్రగ్స్ డీలర్ల ఆర్థికమూలాలను దెబ్బతీస్తే రాష్ట్రంలో మాదకద్రవ్యాలు కొంతమేర తగ్గే అవకాశాలు ఉన్నాయని టీజీ ఏఎన్బీ డీజీ సందీప్ శాండిల్యా ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రగ్స్ సప్లయర్లు టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్లు కొనసాగిస్తామని తెలిపారు.