
నాగర్కర్నూల్, వెలుగు : తెలంగాణలో ఎకో, జంగిల్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని టూరిజం డెస్టినేషన్గా మారుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బుధవారం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతి వల్లూరు, కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి సోమశిల, అమరగిరి ద్వీపం, జటప్రోల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో టూరిజం అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) స్కీం కింద సోమశిలకు రూ.68.10 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
సోమశిలలో వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్ను చేపడుతామన్నారు. సోమశిల, అమరగిరి ద్వీపం, మల్లేశ్వరం, ఈగలపెంట ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల్ల ప్రాజెక్ట్పై కొల్లాపూర్ క్యాంప్ ఆఫీస్లో రివ్యూ చేశారు. పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు.
నల్లమల ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి క్లస్టర్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. క్లస్టర్ 1లో ఈగలపెంట అరైవల్ జోన్, విహారయాత్ర, రివర్ క్రూయిజ్, చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయని, క్లస్టర్ 2లో సోమశిల వెల్నెస్ అండ్ స్పిరిచ్యువల్ రిట్రీట్ ఉంటాయన్నారు. సోమశిల, అమరగిరి ద్వీపంలో బోటింగ్ జెట్టి, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, కెఫెటేరియా, స్పా, వెల్నెస్ సెంటర్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు.