- అసెంబ్లీలో ఆమోదించినవి
- తెలంగాణ మున్సిపాలిటీల చట్ట (సవరణ) బిల్లు
- జీహెచ్ఎంసీ సవరణకు సంబంధించి 2 బిల్లులు
- ప్రైవేట్ యూనివర్సిటీ సవరణ బిల్లు
- మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ (సవరణ)
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ఐదు, శాసన మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. తెలంగాణ మున్సిపాలిటీల చట్ట (సవరణ) బిల్లు, జీహెచ్ఎంసీ (సవరణ) బిల్లులు (జీహెచ్ఎంసీ వార్డుల పెంపు, మున్సిపాలిటీల విలీనం), ప్రైవేట్ యూనివర్సిటీ సవరణ బిల్లు, మోటార్ వెహికల్ టాక్సేషన్ (సవరణ) బిల్లులను శుక్రవారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ పూర్తయ్యాక మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. అనంతరం జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయడం, కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిపారు.
ఆయా బిల్లులపై సభ్యులు లెవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అలాగే, కౌన్సిల్లో మున్సిపాలిటీల చట్ట (సవరణ) బిల్లు, జీహెచ్ఎంసీ చట్ట సవరణకు సంబంధించి రెండు బిల్లులు, రవాణా చట్ట సవరణ బిల్లులకు ఆమోదం లభించింది.
శుక్రవారం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి శ్రీధర్ బాబు మూడు మున్సిపల్చట్ట సవరణ బిల్లులు, మోటార్వెహికల్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ కౌన్సిల్కు హాజరయ్యారు.
