- యువకుడిపై నుంచి లారీ వెళ్లడంతో మృతి
ఎల్కతుర్తి, (కమలాపూర్) వెలుగు: రాంగ్ రూట్ లో వచ్చి స్కూటీని తప్పించబోయి లారీ కింద పడిన యువకుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. శాయంపేట మండలం గట్ల కానిపర్తికి చెందిన కూనూరు రాజు(30) శుక్రవారం రాత్రి ఉప్పల్ వైపు నుంచి పరకాలకు బైక్ పై వెళ్తున్నాడు.
కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో స్కూటీ ఎదురుగా రావడంతో తప్పించబోయి బైక్ స్కిడ్ అయి కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి గ్యాస్ సిలిండర్ల లోడ్ లారీ వచ్చి రాజుపైనుంచి వెళ్లడంతో స్పాట్ లో చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
