కరోనా కంట్రోల్​లో మనమే బెస్ట్​

కరోనా కంట్రోల్​లో మనమే బెస్ట్​
  • టెస్టుల్లో దేశ సగటునే మించిపోయినం: సీఎం
  • కేంద్రాన్ని అలర్ట్​ చేసింది మేమే
  • ఫ్లైట్లు బంద్​ పెట్టాలని ఫస్ట్​ చేప్పింది నేనే
  • రాష్ట్రంలోనే రికవరీ రేట్​ఎక్కువ, డెత్​ రేట్​ తక్కువ
  • కేసీఆర్​ బతికే ఉన్నడు.. ఎవ్వరికీ ఏం కానివ్వడు
  • కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై పరిశీలిస్తం
  • ప్రైవేటోళ్లు దోచుకుంటరని ముందే ఊహించినం

హైదరాబాద్, వెలుగుకరోనా కంట్రోల్‌‌లో చాలా రాష్ట్రాలతో పోలిస్తే  మనమే మెరుగ్గా ఉన్నామని, మన దగ్గరే  రికవరీ  రేట్​ ఎక్కువని సీఎం కేసీఆర్​ అన్నారు. టెస్టులు బాగా చేస్తున్నామని, ఇందులో దేశ సగటును మించిపోయామని పేర్కొన్నారు. డెత్ రేట్​ చాలా తక్కువగా ఉందన్నారు. కరోనాపై మొదట్నుంచి కేంద్రాన్ని తామే అలర్ట్ చేశామని, ఇంటర్నేషనల్‌‌ ఫ్లైట్లు బంద్ పెట్టాలని ఫస్ట్  తానే చెప్పానని అన్నారు. హెల్త్ బడ్జెట్ పెంచాలని  పీఎం కాన్ఫరెన్స్‌‌లో చెప్పానని, ‘మర్కజ్’ గురించి కూడా కేంద్రాన్ని తామే అలర్ట్ చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బుధవారం అసెంబ్లీలో కరోనాపై షార్ట్ డిస్కషన్​లో  సీఎం మాట్లాడారు. లాక్‌‌డౌన్‌‌  టైమ్‌‌లో తమ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. మంత్రి ఈటల  రోజూ కరోనా అంటూ హాస్పిటళ్లు తిరుగుతుంటే, కనీసం రెండు రోజులైనా నియోజకవర్గానికి వెళ్లిరావాలని సూచించానని చెప్పారు. చావులు దాస్తున్నారంటూ ప్రతిపక్షాలు అంటున్నాయని, చావులు దాసుడు సాధ్యమైతదా..? అని సీఎం ప్రశ్నించారు. కరోనాపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకో స్టేట్‌‌మెంట్ ఇచ్చి కన్‌‌ఫ్యూజ్ చేసేదని, కేంద్రమూ ఏదీ కరెక్ట్‌‌గా చెప్పలేదన్నారు.

దవాఖాన్లలో ఖాళీలు వారసత్వంగా వచ్చినయ్​

కరోనా పేషెంట్లకు ధీమా కలిగించేందుకు సీఎం  కనీసం ఒక్క దవాఖానాకూ ఎందుకు పోవడం లేదని సీఎల్పీ నేత భట్టి ప్రశ్నించగా.. ప్రతిపక్షాలు మాత్రమే పనిచేశాయన్నట్లు భట్టి మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. ‘కేసీఆర్ బతికే ఉన్నడు. ఎవ్వరికీ ఏమీ కాకుండా చూస్కుంటా’ అని ఆయన చెప్పారు. గవర్నమెంట్​ హాస్పిటళ్లలో ఖాళీలు, సౌలతులు లేకపోవడం వంటివన్నీ గత ప్రభుత్వాల తప్పిదమేనని, వాళ్ల నుంచి వారసత్వంగా వచ్చినవేనని కేసీఆర్​ విమర్శించారు.

ప్రైవేట్​లో దోచుకుంటరని ముందే ఊహించినం ​

ప్రైవేట్ హాస్పిటళ్లు దోచుకుంటాయని తాము ముందే ఊహించామని, అందుకే వాళ్లకు తొలుత పర్మిషన్ ఇవ్వలేదని సీఎం అన్నారు. కానీ, ఐసీఎంఆర్  పర్మిషన్‌‌ను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్స్​ కోర్టుకు వెళ్లాయని, కోర్టు తీర్పు మేరకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటళ్లు చేస్తున్న దందాను కట్టడి చేసేందుకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో టాస్క్‌‌ఫోర్స్‌‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ కమిటీ ప్రతి వారం ఇచ్చే రిపోర్ట్​ను హెల్త్‌‌ మినిస్టర్‌‌ ఈటల రాజేందర్‌‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపుతారని సీఎం చెప్పారు. కరోనా విపత్తు టైంలో ప్రైవేటు హాస్పిటల్స్​ వాళ్లు​ దుర్మార్గంగా సంపాదించి ఏం చేస్తారో కూడా తెలియడం లేదన్నారు. యశోదా హాస్పిటల్‌‌ యాజమాన్యం గ్రూప్‌‌ -2 అధికారి శ్వేతారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి రూ. 29 లక్షలు కట్టించుకొని శవాన్ని ఇచ్చిందని,  ఇలాంటి దోపిడీని అరికట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభ దృష్టికి తీసుకురాగా సీఎం పైవిధంగా బదులిచ్చారు. కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని భట్టి సూచించగా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.

కేంద్రం చేసిందేమీ లేదు

కరోనా ట్రీట్​మెంట్​కు కేంద్రం చేసింది ఏమీ లేదని, కేంద్రం తీరు శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు అన్నట్టు ఉందని సీఎం కేసీఆర్​ విమర్శించారు. కరోనా టైంలో కేంద్రం నుంచి నేషనల్‌‌ రూరల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ కింద కేవలం రూ. 265 కోట్లు, ఇతరత్రా ఇంకో రూ. 90 కోట్లు వచ్చాయని చెప్పారు.   647 వెంటిలేటర్లను కేంద్రం ఇస్తే 700 వెంటిలేటర్లు రాష్ట్రం సమకూర్చుకుందని పేర్కొన్నారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు కానీ కేంద్రం నుంచి వచ్చిందేమి లేదని విమర్శించారు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారి గురించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వారి దగ్గర ఉన్న సమాచారం ఇస్తే ఆదుకోవాడానికి ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు.

ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు బెటర్​

ఆయుష్మాన్‌‌ భారత్‌‌ కన్నా ఆరోగ్య శ్రీ స్కీం ఎన్నో రెట్లు మెరుగైనదని కేసీఆర్​ పేర్కొన్నారు. కేంద్రం ఒప్పుకుంటే రెండు పథకాలను కలిపి అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని,  ఆయుష్మానే అమలు చేయాలంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. పేదలు కరోనాతో ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకుంటే సీఎంఆర్‌‌ఎఫ్‌‌ నుంచి వారి ఖర్చులను చెల్లిస్తున్నామన్నారు.

కూల్చేసిన చోటనే మసీదులు కడుతం

సెక్రటేరియట్‌‌లో మసీదు కూల్చివేతపై ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ప్రస్తావించగా.. కూల్చేసిన చోటనే రెండు మసీదులు నిర్మించి ఇస్తామని సీఎం  అన్నారు. సెక్రటేరియట్‌‌ ఆవరణలో గుడి, చర్చితో పాటు రెండు మసీదులు నిర్మిస్తామని పేర్కొన్నారు. కరోనాపై షార్ట్‌‌ డిస్కషన్‌‌ అనంతరం స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి సభను గురువారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.