
- కాళేశ్వరం విచారణ తర్వాత మారిన ఈటల స్వరం
- ఆ ప్రాజెక్టు అద్భుత కట్టడమంటూ రాజేందర్ కితాబు
- సీబీఐ విచారణకు అప్పగించాలంటున్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అర్వింద్
- ఎన్నికలకు ముందు కాళేశ్వరం ఏటీఎం అన్న మోదీ
- హాట్ టాపిక్ గా మారిన బీజేపీ భిన్న వైఖరి
హైదరాబాద్: కమలం పార్టీలో కాళేశ్వరం ముసలం మొదలైంది. పార్టీ నేతలు భిన్న వైఖరే ఇందుకు కారణమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబానికి ఆ ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని, దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినా కేంద్రం స్పందించలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తోంది. ఈ నేపథ్యలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రస్తుత మల్కాజ్ గిరీ ఎంపీ,బీజేపీ నేత ఈటల రాజేందర్ ను విచారణకు పిలిచింది.
ఈ నెల 6న ఈటల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచింది. హాజరైన ఈటల రాజేందర్ కమిషన్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అంతా కేబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని, ఇంజినీర్ల సూచన మేరకే కాళేశ్వరం నిర్మించారని చెప్పుకొచ్చారు. బయటికి వచ్చిన తర్వాత కేసీఆర్ నిర్ణయమని మీడియా ముందు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులక్రితం ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఈటల తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత వరమని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, వేసవిలో సైతం చెరువులు మత్తళ్లు దుంకాయని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు 100 శాతం ఉపయోగం ఉన్నదని తెలిపారు. కాళేశ్వరం ఈ రోజు ఎస్సారెస్పీలో 14.8 లక్షల ఎకరాలకు బావుల్లో ఎలాంటి పూడికలు తీయకుండా చివరి ఆయకట్టుకు నీళ్లు అందించింది అని పేర్కొన్నారు. ‘మిడ్మానేరు నుంచి అవసరమైతే రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్ నుంచి కరీంనగర్కు లిఫ్టు ఇరిగేషన్కు నీళ్లు ఇచ్చేందుకు కూడా గ్యారెంటీ ఏర్పడింది.వాగులు పారినయ్. ప్రాణహిత-చేవెళ్ల, మేడిగడ్డ కింద వాగులు, వంకలు పొంగిపొర్లినయి. వందల చెక్డ్యాములు కట్టడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. నేను సాక్ష్యం. నేను 20 ఏండ్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా చేసిన.కాల్వల పొంటి తిరిగాను. చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పాము.. వరంగల్కు ఎన్నడూ ఇన్ని నీళ్లు రాలేవు. నల్లగొండకు ఎన్నడూ ఇన్ని నీళ్లు రాలేవు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయ్యే కరెంట్ బిల్లును పక్కన పెడితే రాష్ట్రానికి ప్రాజెక్టు అద్భుత వరం’ అంటూ ఆకాశానికి ఎత్తారు.
ఆ తర్వాత కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని అన్నారు. కమిషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తోందని, కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేనిదిగా బీజేపీ గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కూడా సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. ఈటల చెప్పిన సమాధానాలను ప్రస్తావించగా అది ఆయన స్టాండ్ అని, బీజేపీది కాదని పేర్కొనడం విశేషం. కాళేశ్వరం కమిషన్ బీజేపీ వైఖరి ఏమిటని ఈటలను అడగలేదంటూ దాట వేశారు.
బీజేపీ ఎంపీగా కమిషన్ ఎదుట హాజరు కాలేదని, బీఆర్ఎస్లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే చెప్పారని తెలిపారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ , నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సైతం కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. ముఖ్యమంత్రి మొదలు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల వరకు కుమ్మక్కయి డీపీఆర్ అప్రూవల్ కాకముందే కన్ స్ట్రక్షన్ స్టార్ చేశారని అన్నారు. ఈ ఎత్తిపోతల పథకలో అవినీతిపై కేంద్రానికి లేఖ రాస్తే సీబీఐ వచ్చి ఎంక్వైరీ చేసి బాధ్యులెవరో తేలుస్తుందని అన్నారు. కాళేశ్వరంపై బీజేపీ నేతల భిన్న వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.