న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించాడు. కొన్నేండ్లుగా నిలకడగా రాణిస్తున్న హుస్సామ్ గతేడాది వరల్డ్ మెన్స్ బాక్సింగ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఇక, 2023 నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం సందడిగా జరిగింది.
స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, రెండు చేతులు లేకున్నా ఆర్చరీలో అద్భుతాలు చేస్తున్న శీతల్ దేవి ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఈ ఇద్దరూ అర్జున అవార్డు అందుకుంటున్న సమయంలో దర్బార్ హాల్ చప్పట్లతో మార్మోగింది. ఖేల్రత్న పురస్కారానికి ఎంపికైన షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి మలేసియా ఓపెన్లో పాల్గొంటున్న కారణంగా సెర్మనీకి హాజరుకాలేదు.
అలాగే, ఆసియా చాంపియన్షిప్లో పోటీ పడుతున్న అర్జున అవార్డీ హైదరాబాదీ యంగ్ షూటర్ ఇషా సింగ్ కూడా దూరంగా ఉంది. గతేడాది మొత్తం 26 మంది అథ్లెట్లు, పారా అథ్లెట్లు అర్జునకు ఎంపికయ్యారు. వీటితో పాటు ద్రోణాచార్య, ధ్యాన్చంద్ పురస్కారాలను కూడా రాష్ట్రపతి అందజేశారు. కాగా, ఖేల్రత్నకు అవార్డుతో పాటు రూ. 25 లక్షలు నగదు, అర్జున, ద్రోణాచార్య అవార్డు విన్నర్లకు రూ. 15 లక్షల నగదు కూడా లభించింది.