- కేబినెట్లో లంబాడా వర్గానికి చోటు
- హైకమాండ్తో సీఎం, పీసీసీ చీఫ్ భేటీలో ప్రస్తావన
హైదరాబాద్, వెలుగు: ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్ తో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని అగ్ర నేతలకు పరిచయం చేసి.. పనిలో పనిగా ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలపై కూడా హైకమాండ్తో చర్చించారు.
మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు పదవుల భర్తీ, ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్త వారిని తీసుకోవడంపై చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలో పలువురు కీలక మంత్రుల శాఖలను సైతం మార్చేందుకు హైకమాండ్ అనుమతి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మధ్య తరచూ వివాదాస్పదమవుతున్న ఓ మంత్రికి ఉద్వాసన పలకడం ఖాయంగా చెప్తున్నారు. ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక లంబాడా సామాజికవర్గానికి ఈ విస్తరణలో చోటు దాదాపుగా ఖాయమైంది. ఈ కోటాలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన రాంచంద్రు నాయక్ ( డోర్నకల్), మురళీ నాయక్ (మహబూబాబాద్)లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాంచంద్రు నాయక్ ప్రస్తుతం విప్ గా కొనసాగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన పేరును గతంలోనే ప్రకటించినా.. ఆయన మంత్రి పదవి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కకపోవడం, రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో రంగారెడ్డికి డిప్యూటీ స్పీకర్పదవిని ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఇక కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి ఆర్టీసీ చైర్ పర్సన్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమెను ఇప్పటికే పబ్లిక్ ఎస్టిమేట్ కమిటీ (పీఈసీ) చైర్పర్సన్గా నియమించినా.. ఆమె ఆ పదవిని తీసుకోలేదు. తనకు ఆర్టీసీ పదవి కావాలని పట్టుబట్టగా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో మంత్రి పదవి ఖాళీగా ఉన్నప్పటికీ దాన్ని ఈ దఫా విస్తరణలో భర్తీ చేస్తారా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
