- సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు
- ఏపీ విభజన చట్టంలోని రెండు సెక్షన్లకు విరుద్ధంగా ప్రాజెక్ట్ విస్తరణ
- రాష్ట్రాలు, కేంద్ర సంస్థల అనుమతులు లేకుండానే ఏపీ పనులు
- ఈ లెక్కన రిట్కు విచారణార్హత ఉన్నదని కోర్టుకు తెలిపిన తెలంగాణ సర్కారు
- కర్నాటక, మహారాష్ట్రలకూ బచావత్ కేటాయింపులున్నయన్న కోర్టు
- ఆ రెండు రాష్ట్రాలనూ చేర్చి సూట్ ఫైల్ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం –నల్లమలసాగర్ లిఫ్ట్ ప్రాజెక్ట్ (పీఎన్ఎల్పీ).. గోదావరి ట్రిబ్యునల్ (బచావత్) అవార్డు (కేటాయింపుల)కు విరుద్ధమని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు మేరకు.. కేంద్రజలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చింది 484.5 (404.5+80 గోదావరి డైవర్షన్) టీఎంసీలేనని, అంతకుమించి వాడుకోవడానికి లేదని తేల్చి చెప్పింది.
వరద జలాల పేరిట ఏపీ ప్రభుత్వం అంతకుమించి ఔట్ సైడ్ బేసిన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నదని, అది బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. ఏపీ చేపడుతున్న ఆ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిల బెంచ్ విచారించింది.
ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్కు విచారణార్హత లేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మరోసారి స్పష్టం చేశారు. రిట్లో పేర్కొన్న అంశాలతో సివిల్ సూట్ ఫైల్ చేయాలని సూచించారు. తెలంగాణ వాదనలపై స్పందించిన జస్టిస్ బాగ్చి.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేవలం ఏపీ, తెలంగాణలకే నీటి కేటాయింపులు చేయలేదని, మహారాష్ట్ర, కర్నాటకలకూ కేటాయించిందని గుర్తుచేశారు.
కానీ, రిట్ పిటిషన్లో ఆ రెండు రాష్ట్రాలను రెస్పాండెంట్స్గా చేర్చలేదని పేర్కొన్నారు. దీంతో ఆ రెండు రాష్ట్రాలనూ పార్టీ స్టేట్స్గా పేర్కొంటూ సూట్ వేయాలని తెలంగాణకు సీజేఐ సూచించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్అభిషేక్ మనుసింఘ్వీ.. రిట్ పిటిషన్ను వెనక్కు తీసుకుంటామని చెప్పారు. సూట్ దాదాపు రెడీ అయిందని, ఫైల్ చేస్తామని కోర్టుకు తెలిపారు.
రాష్ట్ర హక్కులకు నష్టం..
పోలవరం పనులను నిలుపుదల చేయాలంటూ 2011లో కేంద్ర పర్యావరణ శాఖ ఏపీకి నోటీసులిచ్చిందని, కానీ, ఎలాంటి కంప్లయన్స్ లేకుండానే ఆ ఆదేశాలను కేంద్రం పక్కనపెట్టిందని కోర్టుకు తెలంగాణ తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టును సామర్థ్యానికి మించి విస్తరించుకుంటున్నదని, దాని వల్ల తెలంగాణ జల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు సభ్య రాష్ట్రాలు, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి బోర్డులు, కేంద్ర జలశక్తిశాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీల అనుమతి తప్పనిసరి అని ఏపీ పునర్విభజనచట్టంలోని సెక్షన్ 84(3)(ii), సెక్షన్ 85(8)(డీ) స్పష్టం చేస్తున్నాయని, కానీ, ఇప్పుడు ఆ సెక్షన్లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఎవరి అనుమతులు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును చేపడుతున్నదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది.
రిట్కు అర్హతలున్నయ్..
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థల అనుమతుల్లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదని పేర్కొంటూ 2017, 2025లో సీడబ్ల్యూసీ ఇచ్చిన గైడ్లైన్స్కు వ్యతిరేకంగా ప్రాజెక్టును ఏపీ ముందుకు తీసుకెళ్తున్నదని తెలంగాణ వాదించింది. ప్రస్తుతం పోలవరం - నల్లమలసాగర్ కేసులో అన్ని కేంద్ర సంస్థలూ ఇన్వాల్వ్ అయ్యాయని, సీడబ్ల్యూసీ గైడ్లైన్స్కు విరుద్ధంగా ఏపీ తీరు ఉన్న నేపథ్యంలో ‘రిట్’ కింద ఈ కేసును సుప్రీంకోర్టు విచారించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఇది వాటర్ డిస్ప్యూట్ కాదని, సూట్ వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. తమిళనాడు ముళ్లపెరియార్ డ్యామ్ కేసు (పర్యావరణ అనుమతులకు సంబంధించి), గోదావరి నీళ్లను ఏపీ ఏకపక్షంగా తరలించుకుపోవడం పై ఒడిశా వేసిన కేసులను ఆర్టికల్ 32 ప్రకారమే రిట్ కింద విచారించిన విషయాన్ని గుర్తు చేసింది.
