
- నలుగురు విప్ల నియామకం
- ఎస్సీ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరు.. ఇద్దరు బీసీలకు అవకాశం
- అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, రామచంద్రు నాయక్,
- బీర్ల ఐలయ్యను నియమిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు : నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వం విప్లుగా నియమించింది. ఇద్దరు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను నియమిస్తూ శుక్రవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. మంత్రివర్గంలో పాటించిన సామాజిక సమీకరణాలను అనుసరిస్తూ విప్లను నియమించారు.
మంత్రివర్గంలో ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించగా.. అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. విప్గా మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం ఇచ్చారు. మంత్రులుగా గౌడ (పొన్నం ప్రభాకర్), పద్మశాలి (కొండా సురేఖ) సామాజిక వర్గాలకు అవకాశం దక్కగా.. విప్లుగా మున్నూరుకాపు అయిన ఆది శ్రీనివాస్, కురుమ సామాజిక వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు చోటు కల్పించారు. మంత్రివర్గంలో ఎస్టీ కేటగిరీలో ఆదివాసీ అయిన సీతక్కకు అవకాశం దక్కింది. విప్గా లంబాడా సామాజికవర్గానికి చెందిన జాటోత్ రామచంద్రు నాయక్ కు అవకాశం ఇచ్చారు.