- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్పై వేటు
- ఫుల్ సెషన్ సస్పెండ్ చేసిన మండలి చైర్మన్ గుత్తా
- స్పీకర్ ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్
- అసెంబ్లీలో తీర్మానించి మండలికి పంపిన సర్కారు
- రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నామన్న చైర్మన్
- ఉభయ సభల మర్యాదలు కాపాడాల్సిందేనని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్రెడ్డిపై శాసనమండలి వేటు వేసింది. ప్రస్తుత సమావేశాలకు వీరిద్దరినీ సభ నుంచి సస్పెండ్ చేస్తూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం తన నిర్ణయం ప్రకటించారు. శాసనసభలో ఆమోదించిన తీర్మానం ప్రతి తనకు అసెంబ్లీ స్పీకర్ నుంచి అందిందని సభ దృష్టికి తెచ్చారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానానికి సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై నిబంధనావళి ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రొసీజర్, బిజినెస్ కండక్ట్ రూల్స్కు లోబడి తాను తగిన నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు. ఉభయ సభల మధ్య ఉండే మర్యాదలు, చట్టసభల సంప్రదాయాల పరిధిలోనే ఈ అంశాన్ని పరిష్కరిస్తామని సభకు నివేదించారు. నిబంధనల ప్రకారమే సభా కార్యకలాపాలు సాగుతాయని పేర్కొంటూ అసెంబ్లీ నుంచి వచ్చిన తీర్మానం ఆధారంగా చర్యలు తీసుకుంటానని రూలింగ్ ఇచ్చారు.
వాళ్లు సభలో కొనసాగితే ప్రజలు క్షమించరు: పీసీసీ చీఫ్ మహేశ్
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు సభ్యులు మళ్లీ నేరుగా కౌన్సిల్ సమావేశాలకు రావడంపై పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో ఉన్న ఒక దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సభ ఎలా ఉపేక్షిస్తుందని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. బాధ్యతాయుతమైన సభ్యులుగా ఉండి స్పీకర్ వ్యక్తిత్వాన్ని, ఆయన తల్లిని కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సహేతుకం కాదని మండిపడ్డారు.
ఇలాంటి చర్యలకు పాల్పడిన సభ్యులు సభలో కొనసాగితే యావత్ తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు. చట్టసభల గౌరవాన్ని మంటగలిపేలా ప్రవర్తించిన ఇద్దరు సభ్యులను తక్షణమే కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై ఎలాంటి జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. సభాపతి చైర్కు జరిగిన అవమానం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా యావత్ సభా సంప్రదాయాలకే మచ్చ అని అన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండాలంటే తక్షణ వేటు ఒక్కటే సరైన మార్గమని పేర్కొన్నారు.
మంత్రి శ్రీధర్బాబు తీర్మానం..
ప్రస్తుత సభా భావోద్వేగాలను, సభ్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ ప్రతిపాదన చేయాల్సి వస్తోందని మంత్రి శ్రీధర్ బాబు సభకు విన్నవించారు. కౌన్సిల్ రూల్స్లోని రూల్ 308, సబ్-రూల్ 2 కింద సభ్యులైన తాతా మధుసూదన్, నవీన్ కుమార్రెడ్డిని మిగిలిన సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలని మండలిలో తీర్మానించారు. అనంతరం ఈ తీర్మానాన్ని చైర్మన్ సుఖేందర్ రెడ్డి సభలో వాయిస్ ఓటింగ్తో ఆమోదించారు. దీంతో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఈ సెషన్ ముగిసేవరకు శాసనమండలి సేవల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రూలింగ్ ఇచ్చారు.
