
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరగా 2011లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేశారు. వారంతా ప్రస్తుతం ప్రమోషన్లు పొంది ఉన్నత హోదాలో ఉన్నారు. వీరంతా అప్పటి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలోకి వచ్చినవారే. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ పోస్టులు మళ్లీ భర్తీకి నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లందరూ ఇన్చార్జీలే కావడం గమనార్హం. అదేవిధంగా 612 మండలాలలో 90 నుంచి 95 శాతం వరకు ఆయా మండలాలలోని సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులుగా ఇన్చార్జ్ విధులు నిర్వహిస్తున్నారు.
వారంతా ఒకపక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ అదనంగా మండల విద్యాశాఖ అధికారులుగా కొనసాగుతున్నారు. వీరే కాకుండా 33 జిల్లాలకుగాను 26 జిల్లాలకు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇన్చార్జీలే ఉండడం వల్ల విద్యాశాఖలో పర్యవేక్షణ పడకేసిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
గాల్లో దీపంగా పాఠశాల పర్యవేక్షణ
ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునికి మండల విద్యాధికారిగా ఇన్చార్జ్ బాధ్యతలను ఇవ్వడం వల్ల తన బడికి హెడ్మాస్టర్ గానే కాకుండా తరగతి బోధకుడిగా, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా, పీఎంశ్రీ నోడల్ అధికారిగా ఇలా బహుళ పాత్రలను పోషించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాఠశాల పర్యవేక్షణ గాల్లో దీపంగా మారిపోయింది. పెరిగిన పని ఒత్తిడి వల్ల బోధన చేయడం సాధ్యం కాకుండా పోతుంది. ఫలితంగా ఉపాధ్యాయుల పనితీరు, బోధన, హాజరు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు తదితర అంశాలను పర్యవేక్షించే తీరికే లేకుండా పోతుంది.
అలాగే ఒక జిల్లా విద్యాధికారి రెండు, మూడేసి జిల్లాలకు జిల్లా విద్యాధికారిగా కొనసాగుతుండడంతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. తమ మాతృసంస్థలకు కూడా సరియైన న్యాయాన్ని చేకూర్చలేకపోతున్నామని చాలామంది ఇన్చార్జ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాధికారుల కింద ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు కూడా ఇన్చార్జీలే కావడం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులందరూ ఇన్చార్జ్లుగా కొనసాగుతుండటంతో విద్యావ్యవస్థకు మేలుకన్నా కీడే ఎక్కువ అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
పటిష్ట పర్యవేక్షణ అవసరం
గత విద్యా సంవత్సరం సుమారు 11వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకావడంతోపాటు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులను కూడా చేపట్టడంతో కొంతమేర విద్యాబోధన గాడిలో పడినట్లయింది. బోధనా నైపుణ్యాల పెంపు కోసం ఎస్సీఈఆర్టీ ఉపాధ్యాయులకు వేసవి సెలవులలోనే వృత్త్యంతర శిక్షణను సైతం అందించింది. అయితే, కేవలం బోధనా నైపుణ్యాలను పెంచడం ద్వారా మాత్రమే సత్ఫలితాలను ఆశించలేమని నిరంతరం పటిష్ట పర్యవేక్షణ కూడా అవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక ఇన్చార్జ్ పర్యవేక్షణాధికారుల ద్వారా అనుకున్న ఫలితాలు రాబట్టలేమని వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
కొత్త నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చునని, ఆ భర్తీ ప్రక్రియలో ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉండి, బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు కొంత వెయిటేజ్ ఇవ్వడం బాగుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల పోస్టులను కూడా భర్తీ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు నోచుకునే అవకాశం ఉందని పలువురు విమర్శకులు సైతం విశ్లేషిస్తున్నారు.
విద్యాశాఖకు నిధులు కేటాయించాలి
ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షణపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. మండల స్థాయిలో ఎంఈఓ పాత్ర పోషిస్తున్న సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల స్థానంలో రెగ్యులర్ ఎంఈఓల నియామకం ద్వారా మరింత పర్యవేక్షణను పెంచవచ్చునని, తద్వారా ఇప్పుడున్న ఇన్చార్జ్ల మీద పనిభారం తగ్గుతుందని విజ్ఞానవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని విద్యా శాఖకు బడ్జెట్లో ఎక్కువ నిధులను కేటాయింపు చేయడం ద్వారా మౌలిక వసతులను కూడా కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు 30 శాతం బడ్జెట్లో కేటాయింపులు చేయాలి.
- భాస్కర్ యలకంటి, విద్యా విశ్లేషకుడు