తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేశారు. బీసీల సమస్యలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మేనిఫెస్టో రూపంలో రూపొందించి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల సమగ్ర విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ వాటా హక్కుగా సాధించేందుకు రూపొందించిన ' బీసీ కులాల మేనిఫెస్టో -2023 విడుదల చేశారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సగభాగం కంటే ఎక్కువ ఉన్న బీసీల వాటా అమలు చేయడానికి బీసీ మేనిఫెస్టోను బీసీ, కుల, మహిళా, విద్యార్థి సంఘాలతో కలిసి రూపొందించారు.
బీసీ కులాల మేనిఫెస్టో ఇదే..
- 2014లో సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు బయట పెట్టాలి.
- బీహార్ లో మాదిరి కుల గణన చేస్తామని, మహిళా బిల్లు పెడతామని ప్రకటించాలి.
- 27 నుంచి 50 శాతం రిజర్వేషన్ పెంచాలి.
- ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వచ్చినా బీసీ వ్యక్తి సీఎం కాలేదు. అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేస్తామని అన్ని పార్టీలు హామీ ఇవ్వాలి.
- కాంగ్రెస్ పార్టీ రెడ్డి భవన్ గా మారింది. బీసీలకు 60 టికెట్ల ఇవ్వాలి. లేదంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదు.
- బీజేపీ కూడా 60 సీట్లు ఇవ్వాలి..లేదంటే కర్ణాటకలో ఓడిపోయినట్లు ఓడిపోక తప్పదు.
- ఈ మెనిఫెస్టో అమలు చేయకుండా..అగ్రకులాలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయి.
బీసీలకు రావాల్సిన హక్కులు, అభివృద్ది కార్యక్రమాలతో బీసీల బతుకు చిత్రం ఈ మేనిఫెస్టోలో ఉందని బీసీ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. తెలంగాణ వృద్ది చెందాలంటే సగభాగం ఉన్న బీసీలు వృద్ది చెందాలని అభిప్రాయపడ్డారు. అది జరగాలంటే ఈ మేనిఫెస్టో అమలు చేయాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వారికి తగ్గట్లు మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తమ మేనిఫెస్టో వారే రాసుకుంటే..బీసీల బతుకులు ఎలా మారుతాయి..బీసీలు ఎలా అభివృద్ధి అవుతారని ప్రశ్నించారు. బీసీల మేనిఫెస్టో అమలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. 60 శాతం ఉన్న బీసీలకు 3 శాతం నిధులు పెడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టినా.. దాని ఊసే లేదన్నారు.