- యువతకు ఉపాధి కల్పనపై సర్కార్ దృష్టి
- టాటా టెక్, అపోలో సహా ప్రముఖ సంస్థలతో ఎంవోయూలు
- సీఎం రేవంత్, మంత్రి వివేక్ సమక్షంలో ఒప్పందాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో రూ.72 కోట్ల విలువైన 9 కీలక ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మంగళవారం ఈ ఒప్పందాలు జరిగాయి. వీటితో పాటు టామ్కామ్ ఆధ్వర్యంలో మరో ఒప్పందం కూడా జరిగింది. కేవలం చదువులే కాకుండా.. పరిశ్రమలకు కావాల్సిన అడ్వాన్స్డ్ స్కిల్స్లో యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, మెడికల్ స్కిల్స్ వంటి రంగాల్లో కెపాసిటీ బిల్డింగ్, శిక్షణ కార్యక్రమాలను ఈ సంస్థలు నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, ఉపాధి కల్పన శాఖ డీడీ రాజా తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఇవే..
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, అపోలో మెడ్స్కిల్స్, కుకా రోబోటిక్స్ లిమిటెడ్, ఫర్నీచర్ & ఫిట్టింగ్స్ స్కిల్ కౌన్సిల్, ఇండో యూరో సింక్రనైజేషన్, ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, హైటెక్ ఆటోమేషన్ లిమిటెడ్, మార్కోని టెక్నాలజీస్ లిమిటెడ్, వీఐ మైక్రో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
