మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో పనిచేయనుంది. ఇందులో సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగేనావర్, శంషాబాద్ డీసీపీ ఆర్.జగదీశ్వర్ రెడ్డి, నారాయణ్ పేట్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, రాజేంద్ర నగర్ డివిజన్ ఏసీపీ బి.గంగాధర్, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో లక్ష్మీ రెడ్డిని నియమించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలను జారీ చేశారు.
అక్టోబర్ 26న సాయంత్రం
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు), రేగా కాంతారావు (పినపాక), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), గువ్వల బాలరాజు (అచ్చంపేట) అక్టోబర్ 26న సాయంత్రం హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్హౌస్లో ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు స్వామిజీలు, మరో వ్యక్తి కలిసి టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి మొదట ముగ్గురు ఎమ్మెల్యేలు.. తర్వాత కాసేపటికి మరో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పోలీసులు ప్రగతి భవన్కు తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తమకు తాముగా ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు.
తాను పార్టీ లైన్లోనే పని చేశానని, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కేసీఆర్ ప్రెస్మీట్ ఉండబోతున్నదని, మరికొన్ని రికార్డింగులు బయటకు వస్తాయని ఫేస్బుక్లో వరుసగా రెండు రోజులు రేగా కాంతారావు పోస్టింగులు పెట్టారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలోనూ టచ్లోకి రాలేదు. గువ్వల బాలరాజుతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకరు ఫోన్లో మాట్లాడిన రికార్డింగ్ రెండు, మూడు రోజులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
నలుగురు ఎమ్మెల్యేలు కన్నెత్తి చూడలేదు
మునుగోడు ఉప ఎన్నికలో తమకు కేటాయించిన గ్రామాల వైపు నలుగురు ఎమ్మెల్యేలు కన్నెత్తి చూడలేదు. తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లలేదు. కుటుంబ సభ్యులు, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ వివాదం కోర్టుల్లో పెండింగ్లో ఉంది.