రాష్ట్రంలోని థియేటర్లలో సీట్లు ఫుల్ చేసుకోవడానికి అనుమతులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దాంతో ఇప్పటివరకు ఉన్న 50% ఆక్యుపెన్సీ 100%నికి పెంచుకోవడానికి మార్గం సుగమం అయింది. మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లలో 100% ఆక్యుపెన్సీకి అనుమతిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జనవరి 29న ప్రకటన విడుదల చేసింది. దాంతో తెలంగాణలో కూడా 100% సీట్లు ఫుల్ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దానికి సంబంధించి జీఓను కూడా విడుదల చేసింది. కరోనావైరస్ కారణంగా దాదాపు ఏడు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించిందనే చెప్పుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత థియేటర్లు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం కరోనాకు భయపడి థియేటర్లకు దూరంగా ఉంటున్నారు.
సినిమా హాళ్ళలో 100% సీటింగ్కు అనుమతించడంతో అటు థియేటర్ యాజమాన్యాలు, ఇటు ప్రేక్షకులు అనుసరించాల్సిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్ఓపి) కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసింది. సిబ్బంది మరియు ప్రేక్షకులందరూ కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ.. ఫేస్ మాస్క్లను ఉపయోగించాలని తెలిపింది. అదేవిధంగా థియేటర్ సిబ్బంది మరియు ప్రేక్షకులు వారివారి ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని తెలిపింది.
సినిమా ఇంటర్వెల్ సమయంలో కెఫెటేరియా, లాబీలు మరియు వాష్రూమ్లలో రద్దీని నివారించడానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించింది. బ్రేక్ సమయంలో అందరూ ఒకేసారి బయటకు వెళ్లకుండా.. కొంతమందిని ఒకసారి, మరికొంతమందిని ఇంకోసారి బయటకు పంపడానికి ప్రయత్నించాలని చెప్పింది. ఇందుకోసం అవసరమైతే బ్రేక్ సమయాన్ని పెంచుకోవచ్చని కూడా తెలిపింది. మల్టీప్లెక్స్లలో రద్దీని తగ్గించడానికి షో టైమింగ్స్ మార్చుకోవచ్చని తెలిపింది. ప్రతి షో తర్వాత సినిమా థియేటర్లను శుభ్రపరచాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. అదేవిధంగా థియేటర్లోని అన్ని ఎయిర్ కండిషన్ల టెంపరేచర్ 24-30 °C ఉండేలా చూడాలని తెలిపింది.
For More News..