హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం రూ.17,907 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.7458 కోట్లు , వివిధ స్కీముల కింద రూ.10,450 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఈ సారి రూ.230 కోట్లు ఎక్కువ ఇచ్చారు. కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల, మహబూబ్నగర్,‘ కొత్తగూడెం– పాల్వంచ’ కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. పట్టణాభివృద్ధి శాఖ బడ్జెట్ను పరిశీలిస్తే ప్రధానంగా కేంద్రం నిధులపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఈ సారి స్టేట్ సెక్టార్ స్కీమ్స్కింద 6,860.31 కోట్లు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద 1,813.68 కోట్లు చూపడం గమనార్హం.
జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా నిధుల ఖర్చు
ఓఆర్ఆర్ పరిధిలోని17 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత జీహెచ్ఎంసీ ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో మౌలిక సదుపాయాల కోసం రూ.2,654 కోట్లు, మెట్రో రైల్ ఫేజ్2 కోసం రూ.600 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ లోన్ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు, వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు లోన్ చెల్లింపులకు రూ.1,450 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోరకు రూ.1,500 కోట్లు, సుంకిశాల ఇంటెక్ ప్రాజెక్ట్ కోసం రూ.1,000 కోట్లు, హెచ్ఎండీఏ లోన్స్ కోసం రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కరీంనగర్, వరంగల్ అమృత్ స్కీం కోసం స్టేట్ వాటాగా రూ.200 కోట్లకు పైగా కేటాయించడం విశేషం.
పట్టణాభివృద్ధి శాఖ తరపున కేటాయించిన నిధులు (రూ.కోట్లలో)
అంశం 2025 2026
బడ్జెట్ కేటాయింపులు 17,677 17,907
సీడీఎంఏ విభాగం 1,718.26 4,455.46
ఎంఏయూడీ విభాగం 4,760.55 4,193.53
స్టేట్ సెక్టార్ స్కీమ్స్ 5,044.15 6,860.31
సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 1,026.86 1,813.68
