మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్ల పునర్విభజన

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్ల పునర్విభజన
  • ఎన్నికల దిశగా సర్కారు అడుగులు
  •  ముసాయిదా ప్రతిపాదనలు స్టార్ట్
  • ఈ నెల మూడో వారంలో తుది నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఇందులో భాగంగా ఇటీవల కొత్తగా ఏర్పడ్డ  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు వీటిలో విలీనం అయిన గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డులు, డివిజన్ల పునర్విభజనపై మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి జీవో జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా18 నూతన మున్సిపాలిటీలను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. మరో 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. 

కొత్త మున్సిపాలిటీలు, విలీనమైన ప్రాంతాల్లో వార్డుల ఏర్పాటు కోసం జూన్‌‌ 4న నోటిఫికేషన్‌‌ విడుదల చేసి.. 19 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌‌ నిర్ణయించారు. ఈ నెల 5 నుంచి  నుంచి11 వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ఈ నెల 17, 18 తేదీల్లో వార్డుల విభజనను ఆమోదించేందుకు కలెక్టర్లకు పంపనున్నారు.

కలెక్టర్లు ఆమోదించిన జాబితాను 18వ తేదీన మున్సిపల్ శాఖ కమిషనర్‌‌కు, 19న ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. కొత్త వార్డులపై ఈ నెల 21న తుది నోటిఫికేషన్‌‌ ఇవ్వనున్నారు. అయితే, ఔటర్‌‌ రింగ్‌‌రోడ్డు లోపలి మున్సిపాలిటీల్లో వార్డుల విభజనను పక్కన పెట్టారు. ఓఆర్‌‌ఆర్‌‌ వరకు ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి.. పట్టణ పునర్‌‌వ్యవస్థీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున అక్కడ వార్డుల విభజనను వాయిదా వేయాలని నిర్ణయించారు.  

వీటిలోనే పునర్విభజన.. 

కొహిర్, కేసముద్రం, అశ్వరావుపేట, స్టేషన్ ఘనపూర్, మద్దూర్, ఎదులాపురం, దేవరకద్ర, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, ములుగు, బిచ్కుంద, కల్లూరు, అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరగనుంది. మహబూబ్ నగర్, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లు, నర్సంపేట, పరిగి, కొల్లాపూర్, ఆలేరు, బాన్సువాడ, జగిత్యాల, హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోనూ కొత్త వార్డులు ఏర్పాటు కానున్నాయి. కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజన తర్వాత జూన్‌‌ నెలాఖరు వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ శాఖ భావిస్తోంది. మొత్తంగా వచ్చే ఆగస్టులో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.