
ముస్లిం మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కనుక ఇచ్చారు. తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం శుక్రవారం ( సెప్టెంబర్ 19 ) రెండు కొత్త పథకాలు ప్రారంభించింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సక్నక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి లక్ష్మణ్. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన”, “రేవంతన్నా కా సహారా – మిస్కీన్ల కోసం” పేరుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కు సంబంధించిన పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెల్లడించారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు.ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అన్నారు.
లాంచ్ చేసిన పథకాలు:
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు ₹50,000 సాయం.
రేవంతన్నా కా సహారా – మిస్కీన్ల కోసం: ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ. లక్ష గ్రాంట్.
రిజిస్ట్రేషన్ల వివరాలు:
- ప్రారంభం : 19-09-2025
- చివరి తేదీ : 06-10-2025
- ఆన్లైన్ : TGOBMMS వెబ్పోర్టల్ (tgobmms.cgg.gov.in)
- ఆఫ్లైన్ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు.
సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడని.. ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు వెలువడ్డాయని పేర్కొన్నారు మంత్రి లక్ష్మణ్.ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల అంకితభావానికి నిదర్శనమని అన్నారు. మంత్రి గా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు లక్ష్మణ్.
లబ్ధిదారులు ఈ సాయాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలనీ సూచించారు మంత్రి లక్ష్మణ్. మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదని, వారి స్వయం ఉపాధికి దారి చూపడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ పథకాలు కుటుంబ పోషణకు తోడ్పడటమే కాకుండా.. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని అన్నారు.చిన్న వ్యాపారాల ద్వారా సంపాదన పెరిగితే, వారిలోని యువతకు చదువులోనూ, ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని.. ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు.ఈ పథకాలు తాత్కాలిక సహాయం మాత్రమే కాదని, మైనారిటీల దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధికి పునాది అని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి లక్ష్మణ్.