
హైదరాబాద్, వెలుగు: కరోనా కష్టకాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో సర్వీస్ అందించిన డాక్టర్లకు ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఈనెల 31 తర్వాత ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని రాష్ట్రవ్యాప్తంగా వివిధ దవాఖాన్లలో పనిచేస్తున్న డాక్టర్లకు నోటీసులు ఇచ్చింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో 613 మంది డాక్టర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 79 మంది ఫార్మసిస్ట్లు, 202 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ఔట్ సోర్సింగ్ బేసిస్లో ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఈ 613 మంది డాక్టర్లలో 573 మంది మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, 40 మంది ట్యూటర్లుగా పనిచేస్తున్నారు. వీరందరినీ ఈనెల చివరిలో తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో సుమారు 13 వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో నెల రోజుల్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసే వరకూ ఇప్పుడున్న వారిని కొనసాగించాలని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, దవాఖాన్ల సూపరింటెండెంట్లు కోరుతున్నారు. ప్రభుత్వం వీరి అభ్యర్థనను పట్టించుకోకుండా డాక్టర్ల తొలగింపుకే మొగ్గు చూపించింది. ఈ ఉద్యోగాలు 6 నెలలు మాత్రమే ఉంటాయని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నామని మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయంతో వీరిని తొలగించాల్సి వస్తోందని చెప్పారు.