హెచ్ఎండీఏలో మరో మూడు జోన్లు?

హెచ్ఎండీఏలో  మరో మూడు జోన్లు?
  • శంషాబాద్​, శంకర్​పల్లి, ఘట్​కేసర్​   డబుల్​ చేసే చాన్స్
  • ఇప్పటికే మేడ్చల్ రెండు జోన్లు
  • సర్కారు ఓకే అంటే హెచ్ఎండీఏ పరిధిలోకి  మరో 4 వేల చదరపు కి.మీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్​ఎండీఏలో జోన్ల సంఖ్య పెంపు మరోసారి తెరపైకి వచ్చింది. రియల్​ఎస్టేట్​పుంజుకుంటున్న తరుణంలో బిల్డింగ్​ల నిర్మాణాలు, లే అవుట్ల పర్మిషన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు జోన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని సర్కార్  సన్నాహాలు చేస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్​ఎండీఏ పరిధిలో హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, భువనగిరి జిల్లాలు ఉండగా..  వీటిలోని 70 మండలాలు, దాదాపు 1,030 గ్రామాలు, పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో భారీ నిర్మాణాలు, కొత్త వెంచర్లు, లే అవుట్స్​ చేయాలంటే ప్లానింగ్​  డిపార్ట్​మెంట్​పర్మిషన్​ తప్పనిసరి. కాగా, ఇంత మొత్తంలో పర్మిషన్లు ఇవ్వాలంటే ఇప్పుడున్న జోన్లలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఔటర్​రింగ్​రోడ్​అవతల ప్రభుత్వం ట్రిపుల్ఆర్ ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని చూస్తోంది. ఇదే జరిగితే హెచ్ఎండీఏలో మరికొన్ని జిల్లాలు కలుస్తాయి. ప్రస్తుతం 7,224 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న హెచ్​ఎండీఏలోకి మరో 4 వేల చదరపు కిలోమీటర్లు కలిసే చాన్స్​ఉంది. ఈ క్రమంలో మూడు జోన్లను డబుల్​చేయాలని చూస్తున్నట్టు సమాచారం.

మూడు జోన్లు ఆరు జోన్లుగా..

హెచ్​ఎండీఏ పరిధిలో శంషాబాద్​, శంకర్​పల్లి, ఘట్​కేసర్​, మేడ్చల్–1, మేడ్చల్–2​ జోన్లు ఉన్నాయి. గతేడాది వరకు నాలుగు జోన్లుగా ఉండగా అధికారులు సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు మేడ్చల్​జోన్​ను రెండుగా విభజించారు. రెండు జోన్లకు ఒకరు చొప్పున ఇద్దరు డైరెక్టర్లు, ఐదు జోన్ల పరిధిలో ప్లానింగ్​ఆఫీసర్లు(పీఓ), అసిస్టెంట్​ ప్లానింగ్​ ఆఫీసర్లు(ఏపీఓ)లు కలిపి 25 మంది పని చేస్తున్నారు. వీరితో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. గ్రేటర్​ పరిధిలో రియల్ జోరు పుంజుకోవడంతో హెచ్ఎండీఏకు హైరైజ్​ బిల్డింగులు, లేఅవుట్స్, కొత్త వెంచర్ల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి.

 ఉన్న స్టాఫ్​తో ఫీల్డ్​లెవెల్​లో దరఖాస్తులను పరిశీలించి పర్మిషన్​ఇవ్వడానికి చాలా టైం పడుతోంది. ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. సత్వరం అనుమతులిచ్చేందుకు, సిబ్బంది పనిభారం తగ్గించేందుకు ప్లానింగ్​ విభాగాన్ని విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. చాలా కాలంగా జోన్ల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఉంది. మేడ్చల్​మాదిరిగా మిగిలిన మూడు జోన్లను రెట్టింపు చేస్తే దరఖాస్తుల అనుమతులు మరింత వేగంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, అడ్మినిస్ట్రేషన్​ఈజీ అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జోన్ల సంఖ్య పెంచితే మరో ఇద్దరు లేదా నలుగురు డైరెక్టర్లు, 25 మంది వరకూ పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బంది అవసరమవుతారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో జోన్ల సంఖ్య పెంపుపై చర్చించినట్టు తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.