- ఎట్ల పన్నులేద్దాం.. ఏం అమ్ముదాం!
- ఆమ్దానీ కోసం కేబినెట్ సబ్ కమిటీలో చర్చ
- భూములతో పాటు ఆస్తుల అమ్మకం
- రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై నజర్
- కంకర, రోబో ఇసుకపై కూడా పన్నులు
- మైనింగ్ భూముల నుంచి రాయల్టీ వసూలు
- ఆస్తి పన్నుతో పాటు కరెంట్ చార్జీలు పెంచేందుకు సర్కారు ప్లాన్
హైదరాబాద్, వెలుగు: పీకల్లోతు అప్పులు చేసి.. వేలాది ఎకరాల భూములను వేలం పాటలో అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమేం ఆస్తులు అమ్మాలి..? ఎట్లెట్ల పన్నులు పెంచాలి..? అని లెక్కలేసుకుంటున్నది. ఏయే చార్జీలు పెంచి ప్రజల నుంచి ఎంత మేరకు వసూలు చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నది. ఆస్తుల అమ్మకం, పన్నుల పెంపు ద్వారా డిసెంబర్ నాటికి రూ. 10 వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలనే టార్గెట్ను స్పీడప్ చేసింది. ఏడేండ్లలోనే రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేయటంతో ఇప్పటికే రాష్ట్ర ఖజానా గాడితప్పింది. ఒక్కోసారి ఉద్యోగుల జీతాలకు కూడా అప్పు చేయాల్సి వస్తోంది. అప్పులతో పడ్డ గండిని పూడ్చుకునేందుకు వీలైనన్ని మార్గాల్లో ఆదాయం తెచ్చుకోవాలని ప్రభుత్వం డిసైడయింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడేం అమ్మాలి.. ఏమేం పన్నులు పెంచాలో అధ్యయనం చేసే బాధ్యతను మంత్రి హరీశ్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది.
బీఆర్కే భవన్లో గురువారం తొలిసారిగా ఈ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, సబిత, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. నిధుల సమీకరణపై ఈ మీటింగ్లో నాలుగు గంటలపాటు చర్చించారు. సర్కారు భూములను వేలం వేస్తున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్తుల అమ్మకాలకు కేబినెట్ సబ్ కమిటీ మొగ్గు చూపింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టనుంది. ప్రస్తుతం భవన నిర్మాణాలకు వాడే కంకర, రోబో ఇసుక, ఇతర సామగ్రిపై పన్ను లేదని.. వాటిపై కూడా కొత్త పన్ను వేయాలని కమిటీ చర్చించింది. మైనింగ్ భూముల్లో తవ్వకాలు చేపట్టకున్నా రాయల్టీ విధించేలా మైనింగ్ పాలసీని సవరించాలని యోచిస్తోంది. అనుమతి పొందినప్పటి నుంచీ ట్యాక్స్ వేసే ప్రతిపాదనను సిద్ధం చేసింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ పరిధిలోని భూములు, ఇండ్లను ముందు అమ్మేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూముల మార్కెట్ రేట్ల సవరణ, రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు, వెహికల్ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై సమావేశంలో చర్చ జరిగింది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల టార్గెట్ 12 వేల కోట్లు
భూముల మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు ప్రభుత్వం రెడీ అయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా ఉందని, ఇప్పుడున్న భూముల రేట్లకు రిజిస్ట్రేషన్ల వ్యాల్యూకు తేడాను సవరిస్తే ఖజానా నింపుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పట్టణాల్లో 50 శాతం, రూరల్ ఏరియాలో 30 శాతం, వ్యవసాయ భూములపై 20 శాతం, వ్యవసాయేతర భూములపై 40 నుంచి 50 శాతం మార్కెట్ వ్యాల్యూ పెంచే ప్రతిపాదనలున్నాయి. త్వరలోనే ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మార్కెట్ వ్యాల్యూ ఖరారు చేసేందుకు త్వరలోనే అడిషనల్ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీని వేయనున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర కేటగిరీతో పాటు హైవే పక్కనున్న భూములు, కమర్షియల్ బిట్స్, అపార్ట్మెంట్ ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు నిర్ణయించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2020 మార్చిలో పెంచిన మార్కెట్ వ్యాల్యూ ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి సమర్పించింది. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ కావటంతో అప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే రిజిస్ట్రేషన్ల వ్యాల్యూ పెంచితేనే ఈ టార్గెట్ రీచయ్యే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు.
పన్నుల పెంపుపై నిరుటి నుంచే ప్లాన్
పన్నుల ద్వారా ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని, అవకాశమున్న అన్ని పన్నులు, చార్జీలను సవరించాలని ఇప్పటికే సర్కారు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మార్చిలోనే సీఎం కేసీఆర్ పన్నుల పెంపుపై ఇండికేషన్ ఇచ్చారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రాపర్టీ ట్యాక్స్, గ్రామాల్లో ఇంటి పన్నుతో పాటు కరెంట్ చార్జీలు పెంచుతామని అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇందులో భాగంగా దాదాపు 50% వరకు విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు రెడీ చేశాయి. వరుసగా జీహెచ్ఎంసీ, బై ఎలక్షన్ల కారణంగా ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఆర్టీసీ సమ్మె టైమ్లో బస్సు చార్జీలను పెంచిన ప్రభుత్వం.. త్వరలోనే కరెంటు చార్జీల భారం మోపనుంది.
భూముల అమ్మకం షురూ
ఈ నెల ప్రారంభం నుంచే రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయంపై ఫోకస్ పెట్టింది. వారం కిందటే హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూముల అమ్మకానికి ఈ-వేలం నోటిఫికేషన్ జారీ చేసింది. కోకాపేట్, ఖానామెట్ లోని 64 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మాలని నిర్ణయించింది. ఒక్కో ఎకరానికి సగటున రూ. 25 కోట్ల చొప్పున.. దాదాపు రూ. 1,600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.