హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేషన్ పంపిణీ అంటే కేవలం బియ్యం ఇచ్చుడే అన్నట్లు సర్కారు వ్యవహరిస్తోంది. ఉమ్మడి ఏపీలో అమ్మహస్తం పేరుతో 9 రకాల సరుకులను తక్కువ ధరకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందించేది. దీంతో ప్రజలకు ధరల భారం నుంచి కొంత ఊరట లభించేది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రేషన్ సరుకులన్నీ బందైనయ్. పండుగల వేళ ప్రజలకు ధరల భారం తప్పలేదు. పండుగ పూటైనా సర్కారు పేదలను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మండుతున్న ధరలు..
ధరలు మండిపోతున్నాయి. ఊర్లలో పనులు లేవు. చేతిలో పైసలు లేవు. ధరలేమో ఆకాశాన్నంటుతున్నయి. పండగ పూటైనా మంచినూనె, కందిపప్పు, చక్కర తదితర సరుకులు ఇవ్వాలన్న సోయి సర్కారుకు లేదు. గతంలో పండుగల సమయంలో రేషన్ షాపుల్లో అదనపు కోటాగా చక్కెర, కందిపప్పు, పామాయిల్ వంటి సరుకులు అందేవి. రేషన్ షాపులో కిలో కందిపప్పు రూ.50కే అందుబాటులో ఉండేది. పామాయిల్, చక్కెర, చింతపండు, కారం కూడా అగ్గువకు దొరికేది. దీంతో లబ్ధిదారులకు కాస్త భారం తగ్గేది. కానీ ఇప్పుడు రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప వేరే ఏవీ ఇవ్వడం లేదు. బయట మార్కెట్లో కొనాలంటే కిలో కందిపప్పు ధర రూ.110 నుంచి రూ.130 వరకు ఉంది. చక్కెర కిలో రూ.40, లీటర్ పామాయిల్ రూ.100కు పైగా ఉండగా, సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.141 నుంచి రూ.150 వరకు ఉంది. పల్లి నూనె లీటరుకు రూ.164 నుంచి రూ.175 మధ్యలో ఉంది. ఇలా ఏది కొనబోయినా భగ్గుమంటున్న ధరలతో సామాన్యులకు కష్టకాలం తప్పడం లేదు. రాష్ట్రం రాక ముందు ఇందిరమ్మ అభయహస్తం పేరుతో సర్కారు సబ్సిడీ భరించి తొమ్మిది రకాల సరుకులు రూ.185కే అందించేది. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లయ్స్ శాఖ రేషన్ షాపుల్లో 'అమ్మహస్తం' పేరుతో ఈ 9 రకాల సరుకులు ఇచ్చేవారు. బియ్యంతో పాటు కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో గోధుమ పిండి, అరకిలో చక్కెర, కేజీ ఉప్పు, అర కిలో చింతపండు, 250 గ్రాముల కారం పొడి, వంద గ్రాముల పసుపు, లీటరు కిరోసిన్ ఇచ్చేవారు.
రూపాయికి కిలో బియ్యమని, మిగతావి బంద్ పెట్టిన్రు
కేసీఆర్ సర్కారు ఒక్క రూపాయికే కిలో బియ్యం అని, ఒకరికి ఆరు కిలోలు ఇస్తున్నామని చెప్పడంతో పేదలు సంతోషించారు. అంతలోనే ఇదివరకు ఇచ్చిన 9 రకాల సరుకుల్లో కోతపెట్టి మొదట బియ్యం, పంచదార, కిరోసిన్ ఇచ్చారు. తర్వాత చక్కెర, కిరోసిన్ను ఇవ్వడం ఆపేశారు. ఇలా అన్ని సరుకులు బంద్ పెట్టి చివరకు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన కొద్దినెలల వరకు మాత్రమే పంచదార, కిరోసిన్, బియ్యం, గోధుమలు, గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్ ఇచ్చారు. దశలవారీగా గోధుములు, గోధుమపిండి, కందిపప్పు పంపిణీని నిలిపివేశారు. కిలో పంచదార బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 40 ధర పలుకుతోది. రేషన్ డిపో ద్వారా అరకిలో రూ. 6.75 పైసలకు లభించేది. తాము బహిరంగ మార్కెట్లో సరుకులు ఎలా కొనగలమని పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
సబ్సిడీతో ఇచ్చినా బాగుంటది
ఇంతకు మునుపు రేషన్ షాపులో తక్కువ ధరకు అన్ని సరుకులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఒక్క బియ్యమే ఇస్తున్నరు. పండుగలప్పుడైనా సబ్సిడీతో సరుకులు ఇస్తే బాగుండేది.
- ఎం.కుమార్, శనిగపురం, మహబూబాబాద్ జిల్లా
ఆయిల్ ప్యాకెట్లు కూడా ఇస్తలేరు
పండుగలకు అవసరమైన ఆయిల్ ప్యాకెట్లు, చక్కెర, కందిపప్పు ఇస్తలేరు. గతంలో పండుగలు వచ్చినప్పుడు కోటా పెంచి చక్కెర, పామాయిల్ ప్యాకెట్లు తదితర సరుకులు ఇచ్చేవాళ్లు. ఇప్పడు ఏం ఇస్తలేరు. పండుగలెట్ల చేసుకోవాలే?
- అనంతమ్మ, హబ్సిగూడ, హైదరాబాద్
తక్కువ ధరకు ఇయ్యాలే
బయట ఏం కొనాలన్నా ధరలు ఎక్కువగా ఉన్నయి. సర్కారు ఆలోచించి పేదలకు అన్ని సరుకులు తక్కువ ధరకు అందేలా చర్యలు తీసుకోవాలే.
- అజ్మీర సోమన్న, చిన్నంచర్ల, మరిపెడ బంగ్లా