RTA చెక్ పోస్టుల స్థానంలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానం

RTA చెక్ పోస్టుల స్థానంలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ విధానం

తెలంగాణ వ్యాప్తంగా  ఆర్టీఏ చెక్ పోస్టులన్నీ ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.   సాయంత్రం 5 గంటలలోపు   ఆర్టీఏ చెక్ పోస్టులను తొలగించాలని రవాణా శాఖ కమిషనర్ ఇవాళ (అక్టోబర్ 22న ) ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టులన్నీ తొలగించనున్నారు అధికారులు. 

ఏఎన్ పీఆర్ విధానం

చెక్ పోస్టులను ఎత్తివేసిన ప్రభుత్వం వాటి స్థానంలో  ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్‌పీఆర్) అనే అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.  ఈ అడ్వాన్స్​డ్ కెమెరా సిస్టమ్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న ప్రధాన రవాణా శాఖ ఆఫీస్​కు అనుసంధానమై ఉంటుంది. దీంతో రవాణా శాఖలో పారదర్శకత స్పష్టంగా కనిపించనున్నది. అయితే, ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న సిబ్బందికి కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు.

ఏ వెహికల్ అయినా కెమెరా కండ్లుగప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే.. వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్ లను కూడా రంగంలోకి దింపనున్నారు. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్​పోర్ట్ చేసే వాహన యజమానుల అసోషియేషన్ కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్​తో పాటు సరకు రవాణా వాహనాల పర్మిట్లు, మిగిలిన అనుమతులన్నీ ముందే ఆన్ లైన్ లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతుల్లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటి వరకు 15 చెక్ పోస్టుల అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర విధుల్లో ఉన్న సుమారు 70 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఇతర సిబ్బందిని ప్రస్తుతం రవాణా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారులపై రవాణా సమస్యలు లేకుండా, సాఫీగా ప్రయాణం జరిగేందుకు వీలుగా చెక్ పోస్టులను ఎత్తేయాలని గతంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.