అన్నదాతలను ఆదుకోండి

అన్నదాతలను ఆదుకోండి

కేంద్రం అమలు చేస్తున్న ఫసల్​ బీమా యోజన నిబంధనలు సరిగా లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే స్వతహాగా పంటల బీమా అమలు చేయాలి. దేశంలోని అనేక రాష్ట్రాలు స్వతహాగా పంటల బీమా అమలు చేస్తున్నాయి. రైతుబంధు  ఇస్తున్న ప్రభుత్వం పంటల బీమా అమలు చేయలేదా? కావాలంటే రైతుబంధులో కొంత కోత పెట్టి అయినా పంటల బీమా అమలు చేయొచ్చు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన   అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక వ్యవసాయ సబ్సిడీలకు కోత పెట్టారు. కనీసం పంటల బీమానైనా అమలు చేస్తే పంట నష్టాల  సమస్యల నుంచి రైతులు బయటపడగలుగుతారు.

ప్ర కృతి కన్నెర్ర చేసినా, పాలకులు ఉదాసీనత ప్రదర్శించినా నేల తల్లిని, శ్రమను నమ్ముకొని అన్నదాతలు కుటుంబ సమేతంగా రాత్రింబవళ్లు ఆరుగాలం కష్టపడి పంట పండించి భారత జాతికి పట్టెడు అన్నం పెడుతున్నారు. నేడు పంట చేతికి వచ్చే వేళ.. అకాల వర్షాలు, వడగండ్ల బీభత్సం మూలంగా రెక్కల కష్టం కళ్ళముందే చూస్తుండగానే కొట్టుకుపోతుందని కన్నీరు మున్నీరై రోదిస్తున్నారు. ఇలా రైతుల పరిస్థితి హృదయ విదారకంగా మారడంతో వీరు దయనీయస్థితిని అనుభవిస్తున్నారు. దీనికి తోడు గత మార్చి నెలలో 16 నుంచి 21వ తేదీ వరకు వడగళ్ల వానలు పెద్ద ఎత్తున పడ్డాయి.

ఆవేళ ఆయా జిల్లాల్లో మన ముఖ్యమంత్రి పర్యటించి, ఎకరానికి పదివేల రూపాయల సాయం ప్రకటించారు. వారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ నాడు 1,30,968 మంది రైతులు,1,51,645 ఎకరాల విస్తీర్ణంలో పంటను కోల్పోయినట్లు నివేదించారు. రూ,151కోట్ల విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈ సాయం బాధితులకు పంపిణీ చేయకముందే, మళ్లీ భారీగా వడగళ్లు బీభత్సం సృష్టించడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా అకాల వర్షాలు వరుసగా కురుస్తూ ప్రకృతి సృష్టించే బీభత్సం అన్నదాతల బతుకులపై దెబ్బ మీద దెబ్బ తీయడంతో మూలిగే నక్కపై తాటి పండులా ఏ ఏడాదికి ఆ ఏడాది  దుర్భరంగా మారడం బాధాకరం. 

వడగండ్ల వానలతో అపార నష్టం

ఈ బీభత్సం వల్ల విరిగిన చెట్ల వలన దారి పొడవునా ఇబ్బందులు, విద్యుత్ స్తంభాలు విరిగి పడడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతేకాదు భారీ వర్షం వలన కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో అరకొర వసతుల మూలంగా  నీటి ప్రవాహంలో పండించిన ధాన్యం కొట్టుకుపోవడం హృదయవిదారకం. పిడుగులు పడటంతో మనుషులు, పశువులు చనిపోయారు.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో విడవకుండా నాలుగు రోజులు ఊహించని రీతిలో అకాల భారీ వర్షాల విపత్తు నుంచి రైతుల పంట ఉత్పత్తులకు రక్షణ కల్పించడం కష్టంగా మారింది. ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో సుమారు 2,36,184 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అందులో అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి పైర్లకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది.  ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. 

అన్నదాత భద్రతే ఆహార భద్రత

ప్రపంచ దేశాల్లో ప్రకృతి బీభత్సాల మూలంగా పంట నష్టపోయిన వారికి బీమా రూపంలో తక్షణ సాయం అందిస్తున్న విధానాలను మన దగ్గర అమలు చేయాలి. మన దగ్గర పంటల బీమా, మద్దతు ధర లాంటి కీలక అంశాలపై స్వామినాథన్ మేలిమి సిఫారసులకు ఇకనైనా కార్యరూపం దాల్చాలి. అన్నదాతలు ఏ దశలోనూ నష్టపోకుండా ‘జాతీయ రక్షణ చట్టాన్ని’ కేంద్రం రూపొందించాలి. పంట నష్టం అంచనాలకు ఉండే పరిమితులైన 33శాతం దెబ్బతింటేనే పరిహారం, నెలల వ్యవధిలో రెండుసార్లు పంట నష్టానికి గురైతే ఒక్కసారి మాత్రమే పరిహారమిచ్చేలా ఉన్న నిబంధనలు సవరించాలి. అన్నదాత భద్రతే - ఈ దేశ ఆహార భద్రత అనేలా పాలన సాగాలి. నేడు మన రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుందనే ప్రకటనలతో ఓదార్చడం కాకుండా, వెంటనే క్షేత్రస్థాయిలో నష్టం జరిగిన వడగండ్ల వరుస బీభత్సాలను అంచనా వేసి అన్నదాతలు అందరికీ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల వైఫల్యం లేకుండా పారదర్శకంగా నష్టపోయిన ప్రతి అన్నదాతకు నష్టపరిహారం అందించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అన్నదాతలకు భరోసా కల్పించి పాలకులు వారి రుణం తీర్చుకోవాలి.  అన్నదాతల భద్రత అంటే అది మన భద్రత అని భావించాలి.

పంటల బీమా అనివార్యం

రైతులు నష్టపోయారు అంటే? ఆ ప్రభావం అన్ని వ్యవస్థలపై, అన్ని వర్గాలపై పడుతుందనేది కాదనలేని నిజం. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రతి ఏటా ఇలా అన్నదాతలు శ్రమకోర్చి పండించిన పంటను అకాల వర్షాలు నట్టేట ముంచడంతో అప్పులు తీర్చుకోలేక, ఆర్థిక భారం మోయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దారుణా zలు చూస్తున్నాం. ఈ రైతు ఆత్మహత్యలను ఇన్నాళ్ల స్వాతంత్ర్య పాలనలో కూడా ఆపలేమా! దీనికి పాలకుల విధానాల లోపం లేదా? ఏది ఏమైనా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యలతో వీరిని ఆదుకోవాల్సిన విధానాలను ప్రభుత్వాలు మెరుగు పరుచుకోవాలి. వారికి భరోసా కల్పించాలి. ఇలా ప్రకృతి విపత్తుల నుండి అన్నదాతలను ఆదుకోవ డానికి ఉద్దేశించిన పంటల బీమా పథకం ఏ దశలోనూ రైతాంగానికి బీమా ఇవ్వలేని పరిస్థితులను ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

కేంద్రం అమలు చేస్తున్న ఫసల్​ బీమా యోజన నిబంధనలు సరిగా లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే స్వతహాగా పంటల బీమా అమలు చేయాలి. దేశంలోని అనేక రాష్ట్రాలు స్వతహాగా పంటల బీమా అమలు చేస్తున్నాయి. రైతుబంధు  ఇస్తున్న ప్రభుత్వం పంటల బీమా అమలు చేయలేదా? కావాలంటే రైతుబంధులో కొంత కోత పెట్టి అయినా పంటల బీమా అమలు చేయొచ్చు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన   అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక వ్యవసాయ సబ్సిడీలకు కోత పెట్టారు. కనీసం పంటల బీమానైనా అమలు చేస్తే పంట నష్టాల  సమస్యల నుంచి రైతులు బయటపడగలుగుతారు. పరిహారం వెంటనే అందించాలి