మెడిసిన్ కంపెనీలకు వందల కోట్ల బాకీ
3 నెలలుగా ఆరోగ్యశ్రీకి నో పేమెంట్స్
కేసీఆర్ కిట్టుకూ పైసల్లేవంటున్న అధికారులు
ఆరోగ్య శాఖ డబ్బులకు ఇబ్బంది పడుతోంది. పోయిన బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేయడంతో 4 నెలల ముందే ఖజానా ఖాళీ అయింది. మందులు కొనేందుకూ పైసల్లేక మెడిసిన్ సప్లై చేసే సంస్థలకు రూ.వందల కోట్లు బాకీ పెట్టింది. కేసీఆర్ కిట్లో భాగంగా బాలింతలకిచ్చే నగదునూ నాలుగైదు నెలలుగా పెండింగ్ పెట్టింది. 3 నెలలుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు ఇవ్వట్లేదు. ఇక దవాఖాన్లలో రిపేర్లకు నోచుకోక పెద్ద పెద్ద మిషన్లు మూలకు పడిఉన్నాయి. ఆరోగ్యశాఖకు 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.7,375 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది దాన్ని రూ.5,694 కోట్లకు తగ్గించారు. దీంతో ఒక్కో విభాగానికి వందల కోట్లలో బడ్జెట్ తగ్గింది. ఉదాహరణకు గతేడాది మెడిసిన్స్ కొనేందుకు రూ.332 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.226 కోట్లకు తగ్గించారు. దీనికి తోడు గతేడాది కేటాయించిన దాంట్లో కేవలం రూ.110 కోట్లను మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు కేటాయించిన మొత్తంలో 60% పాత బకాయిల చెల్లించడానికే పోతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
కేసీఆర్ కిట్ల బాకీ రూ.160 కోట్లు
ప్రభుత్వానికి కేసీఆర్ కిట్ స్కీమ్ మంచి పేరు తెచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవం అయిన వాళ్లకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడైతే రూ.12 వేలు ఇస్తారు. గర్భిణిగా ఉన్నప్పట్నుంచి ప్రసవం వరకూ పలు దఫాల్లో ఈ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లలో వేస్తారు. అయితే, నాలుగైదు నెలలుగా ఈ నిధులు రిలీజ్ చేయకపోవడంతో సుమారు రూ.160 కోట్లకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో లబ్ధిదారులు ఏఎన్ఎంలను ప్రశ్నిస్తున్నారు.
మెడికల్ ఎడ్యుకేషన్కు రూ.214 కోట్లే
ఇయ్యేడు మెడికల్ ఎడ్యుకేషన్ బడ్జెట్లోనూ భారీగా కోత పెట్టారు. కేవలం రూ.214 కోట్లతో సరిపెట్టేశారు. దీంతో కొత్తగా మంజూరైన నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాస్తవానికి ఈ కాలేజీలకు కొత్తగా బిల్డింగ్స్ కట్టాలి. ప్రస్తుతం నల్గొండ కాలేజీని ఆ జిల్లా హాస్పిటల్లో నడిపిస్తుండగా, సూర్యాపేట కాలేజీని ఓ పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్లో నడిపిస్తున్నారు. ‘ఈ బిల్డింగ్ హైస్కూల్కు ఎక్కువ.. డిగ్రీ కాలేజీకి తక్కువగా ఉంది. స్టాఫ్కు స్టూడెంట్స్కూ కలిపే బాత్రూమ్లు ఇచ్చారు. అవి కూడా తక్కువే ఉన్నాయి. స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు.’ అని అక్కడ పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులివ్వకుంటే మేమేం చేస్తామని అధికారులు చెబుతున్నారు.
కేంద్రం డబ్బులతో హెల్త్ ప్రోగ్రామ్స్
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్ల మేనేజ్మెంట్స్ ఆగస్టులో సమ్మె చేయడంతో నెల నెలా నిధులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం సమ్మె విరమింపజేసింది. మళ్లీ 3 నెలలుగా నిధులు రిలీజ్ చేయడం లేదు. దీంతో బకాయిలు రూ.450 కోట్లకు చేరినట్టు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న హెల్త్ ప్రోగ్రామ్స్లో అధికశాతం నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఫండింగ్వే ఉన్నాయి. నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ స్ర్కీనింగ్, హెపటైటిస్ స్ర్కీనింగ్, అంతర, టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ సహా పలు కార్యక్రమాలకు కేంద్రమే ఎన్హెచ్ఎం కింద నిధులిస్తోంది.