
హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్.2 పరీక్షల తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 15,16న రెండ్రోజుల పాటు గ్రూప్.2 పరీక్షలు నిర్వహించున్నట్లు తెలిపింది. గత నెల అభ్యర్థుల విజ్ఞప్తితో గ్రూప్.2 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. డీఎస్సీ కారణంగా గ్రూప్.2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరిన సంగతి తెలిసిందే. తాము ప్రిపేర్ కావడానికి సమయం కావాలని, ఈ నేపథ్యంలోనే వాయిదా కోరుతున్నామని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అభ్యర్థులతో చర్చించారు. డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి గ్రూప్.2 పరీక్షను వాయిదా వేశారు.
ALSO READ | గ్రూప్ 2 పరీక్ష వాయిదా : TGPSC అధికారిక ప్రకటన
783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మూడు సార్లు గ్రూప్-2 వాయిదా పడగా.. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ పరీక్షలు కూడా అదే సమయంలో ప్రారంభం కావడంతో గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. దీంతో సర్కారు వారిపట్ల సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్.2 పరీక్ష ఇప్పటికి మొత్తం నాలుగు సార్లు వాయిదా పడింది. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు.
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్షలు
- ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ
- డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
- డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2
- డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
- డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4