
హైదరాబాద్, వెలుగు: మద్రాసు హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కె.సురేందర్కు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదులు మొదటి కోర్టు హాలులో సమావేశమై వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ సుజయ్ పాల్, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు జస్టిస్ కె.సురేందర్ చేసిన సేవలను కొనియాడారు. 22,622 ప్రధాన కేసులను, 18,812 మధ్యంతర పిటిషన్లను ఆయన పరిష్కరించారని తెలిపారు.
సీబీఐ, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థల తరఫున వాదనలు వినిపించారన్నారు. సత్యం కేసు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు, లుంబీనీ పార్కు, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ తరఫున వాదించారని, ఇందులో దోషులకు శిక్ష పడిందని గుర్తుచేశారు. జస్టిస్ కె.సురేందర్ మాట్లాడుతూ.. తనకు సహకరించిన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, జస్టిస్ సురేందర్ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.