
- రెండు బెంచ్ల వద్ద ఒకే కేసు పిటిషన్లు
- పాత కేసు గురించి గుట్టుగా ఉంచడంపై జడ్జి అసహనం
హైదరాబాద్, వెలుగు: భూ వివాదానికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉందనే విషయాన్ని గుట్టుగా ఉంచి.. మరో ధర్మాసనం వద్ద అదే భూమికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడంపై ఆగ్రహించిన జడ్జి.. పిటిషనర్కు కోటి రూపాయల జరిమానా విధించారు. హైకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా? అంటూ పిటిషనర్ వెంకట్రామిరెడ్డిపై జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారీ జరిమానా విధిస్తూ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. ఒక పిటిషన్ పెండింగ్లో ఉండగా.. మరో ధర్మాసనం వద్ద పిటిషనర్ ఉత్తర్వులు పొందడాన్ని జడ్జి తీవ్రంగా తప్పుబట్టారు.
చట్ట ప్రకారం.. పిటిషన్లోని అంశాలకు సంబంధించి అప్పటికే పిటిషనర్ కేసు వేసుంటే.. ఆ విషయాలను తాజా పిటిషన్లో స్పష్టంగా వివరించాల్సి ఉంటుందని జడ్జి తెలిపారు. ఫస్ట్ పిటిషన్ను గుట్టుగా ఉంచి మళ్లీ పిటిషన్ వేసి హైకోర్టును తప్పుదోవ పట్టిచడంపై జడ్జి మండిపడ్డారు. కోటి రూపాయల జరిమానాను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి ఏప్రిల్ 10లోగా చెల్లించాలని, లేకపోతే పిటిషనర్ను తమ ఎదుట హాజరుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ను జడ్జి ఆదేశించారు. ఫోరం షాపింగ్ (వ్యూహాత్మకంగా కోర్టుల్లో అనుకూలమైన ఉత్తర్వులు పొందే ప్రయత్నం) ఉపేక్షించబోమని హెచ్చరించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతామని, కోర్టుల్లో తప్పుడు సమాచారంతో కేసులు వేసి, నిజాన్ని దాచిపెట్టి ఉత్తర్వులు పొందేందుకు జరిగే ప్రయత్నాలను బట్టబయలు చేస్తామన్నారు.
9.11 ఎకరాల భూ వివాదం
హైదరాబాద్జిల్లా బండ్లగూడ మండలం కందికల్ సర్వే నంబర్ 310/1, 310/2లో 9.11 ఎకరాల భూమి ఉందని, ఆ ల్యాండ్ను అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని హైకోర్టులో వెంకట్రామిరెడ్డి పిటిషన్ దాఖలు చేశాడు. 9.11 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ బండ్లగూడ ఎమ్మార్వో లేఖ రాశారని పిటిషనర్ తరఫు అడ్వకేట్ కోర్టుకు వివరించారు. పిటిషనర్ తన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. పిటిషనర్ పేర్కొన్న సర్వే నంబర్లు కందికల్ గ్రామంలో లేవని ప్రభుత్వం తరఫు అడ్వకేట్ కోర్టుకు వివరించారు.
కందికల్ గ్రామంలో 309/5 సర్వే నంబర్తోనే ముగుస్తుందని తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పిటిషనర్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ భూమిని కాజేసే కుట్ర చేశారని ఆరోపించారు. కందికల్లోని ప్రభుత్వ భూమిపై ఇప్పటికే యాజమాన్య హక్కులపై న్యాయవివాదాలు కోర్టుల్లో ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత పాత కేసులోని పత్రాలను పరిశీలించిన జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక.. కోటి రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.