హైదరాబాద్, వెలుగు: పరిగిలో ఇస్లామిక్ మత సమ్మేళనం నిర్వహించేందుకు నిషేధిత ‘తబ్లిగీ జమాత్’ అనే సంస్థకు రూ.2.45 కోట్లు మంజూరు చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ కలెక్టర్, స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో, తబ్లిగీ జమాత్ లీడర్లకు నోటీసులు జారీ చేసింది.
తబ్లిగీ జమాత్కు నిధులు మంజూరు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గత నెల 13న జీవో 123ని జారీ చేశారు. దీన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ గద్వాల్ జిల్లా భీమ్నగర్కు చెందిన అఫ్సర్ పాషా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం విచారించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో పరిగి మండలం జెమాత్ నగర్లో ఇస్లామిక్ మత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పిటిషన్లో తెలిపారు. నిధులు మంజూరును నిలిపివేయాలని కోరారు. తబ్లిగీ జమాత్ అనే సంస్థ 2020 జనవరిలో నిర్మల్ టౌన్లో ఇస్లామిక్ సమ్మేళనం నిర్వహించిందని, ఆ తర్వాత రోజు భైంసాలో మతపరమైన హింస చెలరేగిందని వివరించారు.