
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ యాక్ట్ల కింద ఆ రెండు డిపార్ట్మెంట్స్లో ఎదురయ్యే వివాదాల విచారణకు వీలుగా చట్ట ప్రకారం టిబ్యునల్స్ను ఎందుకు ఏర్పాటు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
చీఫ్ సెక్రటరీ, జీఏడీ, మున్సిపల్, పంచాయతీరాజ్, లా డిపార్ట్మెంట్స్ ముఖ్యకార్యదర్శులకు, మున్సిపల్ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లకు నోటీసులిచ్చింది. పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాల కింద ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయలేదని వివరిస్తూ అందిన లేఖను హైకోర్టు పిల్గా పరిగణించింది. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ లక్ష్మినారాయణ అలిశెట్టిలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది.