- ఈ నెల 9కి తీర్పు వాయిదా
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్వెస్టిగేషన్ పూర్తవుతున్న ఈ స్టేజ్ లో బెయిల్ ఇవ్వొద్దని కోరింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు జస్టిస్ కె.సుజన తీర్పును ఈనెల 9కి వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. మే 8న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, సిట్ ఆధ్వర్యంలో 18 మంది సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశామన్నారు.
త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నందున బెయిల్ ఇవ్వరాదన్నారు. నిందితుడి తండ్రి హోదా, పలుకుబడి నేపథ్యంలో వారు మాట మార్చితే కేసు వీగిపోతుందన్నారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. భగీరథ్ స్టూడెంట్ అని, 45 రోజులకు పైగా జైల్లో ఉన్నాడన్నారు. 5 నెలల తర్వాత ఎలాంటి సరైన రీజన్ లేకుండానే ఈ కంప్లైంట్ చేశారని, బెయిల్ ఇస్తే అన్ని కండిషన్స్ కు కట్టుబడి ఉంటాడని కోరారు.
కోర్టు ఆన్లైన్ ప్రసారం నిలిపివేత..
కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణను ఆన్లైన్ ప్రసారం చేయడంపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు రూల్స్ ప్రకారం పోక్సోతోపాటు రేప్ తదితర కేసుల్లో ఆన్లైన్ ప్రొసీడింగ్స్ నిర్వహించరాదన్నారు. ఆన్లైన్ టెలికాస్ట్ వల్ల పిటిషనర్కు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ.. కోర్టు ప్రొసీడింగ్స్ ఆన్లైన్ ప్రసారాన్ని స్టాప్ చేశారు.
