
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందజేసింది. బ్యారేజీకి సంబంధించిన 20 రకాల డాక్యుమెంట్లు కావాలని అథారిటీ అధికారులు అడగారు. దీంతో బ్యారేజీ డిజైన్లు, డ్రాయింగ్లు, ఇతర ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు, పిల్లర్లకు సంబంధించిన ఫొటోలు సహా డాక్యుమెంట్లను ఆదివారం రాత్రి సమర్పించింది. ఈ నెల 24న ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో కూడిన ఎక్స్పర్ట్ టీమ్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది.
25న జలసౌధలో ఇరిగేషన్ ఈఎన్సీలు, ఇతర ఇంజినీర్లతో భేటీ అయింది. ఇదే సమయంలో ఎన్డీఎస్ఏ ప్రతినిధులు బ్యారేజీకి సంబంధించిన 20 రకాల డాక్యుమెంట్లు కావాలని కోరగా, మూడు రకాల డాక్యుమెంట్లను పూర్తిగా, బ్యారేజీ డ్రాయింగ్స్ను పాక్షికంగా సమర్పించింది. మిగతా డేటాను ఆదివారంలోగా సమర్పించాలని ఎన్డీఎస్ఏ లేఖ రాయగా.. పెండింగ్లో ఉన్న 17 రకాల డాక్యుమెంట్లలో ఆదివారం సాయంత్రం వరకు 15 రకాల ఫైల్స్ను సబ్మిట్ చేశారు. మిగతా రెండు రకాల డాక్యుమెంట్లను రాత్రి పంపించారు.