పెట్టుబడులతో రండి.. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ అనువైనది : శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

పెట్టుబడులతో రండి.. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ అనువైనది :  శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

హైదరాబాద్, వెలుగు: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైనదని, మంచి వనరులు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పలు ఎంఎన్​సీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు తాము కల్పించే రాయితీలు, ఇచ్చే ప్రోత్సాహకాల గురించి వివరించారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని తెలిపారు. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు.. ఆదివారం జెడ్డాలోని పలు సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. 

సౌదీ యువరాజు ఆఫీస్ స్పెషల్ జనరల్ డైరెక్టర్ మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్​తో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు సహకారం అందించడం వంటి అంశాలను వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. తర్వాత ఆరాంకో సంస్థ ప్రతినిధులతోనూ ఆయన సమావేశమయ్యారు. 

ఆ సంస్థకు అన్ని విధాలుగా మద్దతిస్తామని చెప్పారు. ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సీఈవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ ఫైజ్ బిన్ అబ్దుల్ హకీమ్‌‌‌‌‌‌‌‌తోనూ సమావేశమయ్యారు. ప్రముఖ ఇన్వెస్ట్​మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులు, జెడ్డా చాంబర్స్, సవోలా గ్రూప్​ సీఈవో వలీద్ ఫతానా, సౌదీ బ్రదర్స్ కమర్షియల్​ కంపెనీ సీఈవో, బోర్డు సభ్యులు, పెట్రోమిన్ కార్పొరేషన్ ప్రతినిధులు, బట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్​ బెట్టర్జీలతోనూ శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.