- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను జిల్లాకో మండలంలో ప్రారంభిస్తున్నట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలోని మిఠాయిపల్లి జరిగిన గ్రామసభలో పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో అమనగల్ మండలంతోపాటు ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, సంగారెడ్డి జిల్లా వట్పల్లి,నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమాల ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతి తెచ్చామని, ఆధార్ నంబర్లా ప్రతి భూమికి భూధార్ నంబర్ను కేటాయిస్తామన్నారు. జీపీవోలను, మండలానికి నలుగురు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించామని తెలిపారు.
సర్వే విషయంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి ఇప్పటికే 411 రోవర్లతో కచ్చితమైన సర్వే చేయిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ పాలకులు ప్రవేశపెట్టిన ధరణి కారణంగా రాష్ట్రంలో 9.52 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు దిక్కులేకుండా పోయిందన్నారు. సాగుచేస్తూ, వారి ఆధీనంలో ఉండే భూములకు సంబంధించి సదరు వ్యక్తి వద్ద కన్సెంట్ తీసుకొని భూమి పట్టాను ఖరారు చేస్తామన్నారు. గతంలో గ్రామంగా ఉండి ఇప్పుడు మున్సిపాలిటీలుగా మారిన ప్రాంతాలకు ఈ సాదాబైనామాలు వర్తించేలా చేస్తామని ప్రకటించారు.
