
- త్వరలో 17 లక్షల చిన్నారులకు హెల్త్ స్క్రీనింగ్
- గైడ్లైన్స్ విడుదల చేస్తం: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర సర్కార్.. "బాల భరోసా - ఆరోగ్యానికి ఆరంభం" అనే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఐదేండ్ల లోపు పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స, అవసరమైతే శస్త్రచికిత్సలు అందించనున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకే ఈ పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ స్కీములో భాగంగా రాష్ట్రంలోని 17 లక్షల అంగన్వాడీ చిన్నారులకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. మెడికల్ టెస్టుల్లో చిన్నారిలో ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే ప్రభుత్వం ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తుంది.
అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా చేస్తుంది. పోషకాహార లోపం, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు వంటి లోపాలను ముందుగా గుర్తించి చికిత్స చేస్తారు. చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ద్వారా పిల్లల ఆరోగ్య భవిష్యత్తును రక్షించనున్నారు.
పేద, మధ్యతరగతికి ఊరట
ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలు వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తున్నది. ఈ పథకం ద్వారా ఆ ఆర్థిక భారం తొలగిపోతుందని.. చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అధికారులు తెలిపారు.
త్వరలో స్కీమ్ స్టార్ట్ చేస్తం: మంత్రి సీతక్క
"బాల భరోసా - ఆరోగ్యానికి ఆరంభం" పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేరే చిన్నారులకు ఈ పథకంలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. పథకం వివరాలు గైడ్లైన్స్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు.