
డ్రైవర్గా పనిచేసేందుకు సౌదీ వెళ్లి యజమాని కుమార్తెను ప్రేమించిన నిజామాబాద్ యువకుడు ఆమెను పెళ్లాడి కటకటాలపాలయ్యాడు. నిజామాబాద్కు చెందిన అజీముద్దీన్(30) సౌదీలో ఉద్యోగం కోసం వెళ్లి జిజా నాసర్ అల్ హరాబి వద్ద డ్రైవర్గా పనిచేశాడు. ఆ సమయంలో యజమాని కుమార్తె రజా అల్ హరిబి ప్రేమలో పడ్డాడు. 2018 జనవరిలో భారత్కు తిరిగి వచ్చాడు. అయినా రాజా అల్ హరిబి ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఇందులో బాగంగానే ఒక రోజు కాలేజే టూర్ కోసం ఒమన్ వెళ్తున్నామని ఇంట్లో చెప్పి మేనెలలో నేపాల్ మీదుగా భారత్ చేరుకుంది.
అజీముద్దీన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి.. ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయంలో తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ యువకుడిపై కేసు పెట్టాడు. నిజామాబాద్ పోలీసులు అజీముద్దీన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తాను మేజర్నని.. యువకుణ్ని ఇష్టపూర్వకంగానే మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపింది. దీంతో చేసేది ఏమీ లేక తండ్రి జిజా నాసర్ తిరిగి సౌదీకి వెళ్లాడు.
యువతి గర్భం దాల్చడంతో ఆమె తండ్రి ఇద్దరిని సౌదీ రావాల్సిందిగా యువకుడికి వీసాను పంపించాడు. దీంతో తల్లిదండ్రులు తమను సాదరంగా ఆహ్వానిస్తున్నారనే ఆశతో దంపతులు 2019 ఏప్రిల్ 20న సౌదీకి వెళ్లారు. ఇక్కడి ఎయిర్ పోర్టులో దిగగానే అజీముద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గల్ఫ్ చట్టాల ప్రకారం.. ఇక్కడ పెళ్లిళ్లకు వధువు తండ్రి అంగీకారం తప్పనిసరి. తన కుమార్తెను మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నట్లు అజీముద్దీన్పై సౌదీ పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు.
తానేమీ తప్పు చేయలేదని.. పూర్తిగా భారత చట్టాల ప్రకారం తమ పెళ్లి జరిగిందనేది అజీమ్ వాదన. తనపై మోపిన కేసులను కొట్టివేయాలని కోరుతున్నాడు. ఇటీవలే రజా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అజీమ్ను భారతీయ ఎంబసీ బృందం జైల్లో కలిసి విషయాన్ని ఢిల్లీ అధికారులకు తెలిపారు.