
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. అయితే రాష్ట్రంలోని అన్ని స్థానాలకు కాదు. పలు కారణాల రీత్యా ఖాళీ అయిన 3 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ, 2 గ్రామ పంచాయతీ స్థానాలకు ఏపీ ఎన్నికల సంఘం జులై 28న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆగస్ట్ 12న 3 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలకు, ఆగస్ట్ 10న రెండు గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనుండటం గమనార్హం. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీ స్థానానికి కూడా ఆగస్ట్ 12న ఎన్నికలు జరగనున్నాయి.
ఇక.. మూడు ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే.. పల్నాడు జిల్లా కారంపూడి, నెల్లూరు జిల్లా విడవలూరు, చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీటీసీ స్థానాలకు ఆగస్ట్ 12న ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఆగస్ట్ 10న తూర్పు గోదావరి జిల్లాలోని కడియపులంక, కొండేపూడి గ్రామ పంచాయతీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
Also read:-కార్యకర్తల కోసం యాప్.. జగన్ సంచలన నిర్ణయం..
ఆగస్ట్ 14న 3 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. జులై 30 నుంచి ఆగస్ట్ 1 వరకూ నామినేషన్ల స్వీకరణకు అనుమతిస్తారు. ఆగస్టు 12న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనుండగా, ఆగస్టు 14న ఫలితాలు వెల్లడవుతాయి. ఆగస్టు 10న సర్పంచ్ ఎన్నికలు .. ఉండగా, అదే రోజున ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది.