తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల

తెలంగాణ  వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల

హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు సోమవారం(సెప్టెంబర్ 25) ఆవిష్కరించారు. వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా కొత్తగా అపాయింట్ అయిన 310 ఫార్మసిస్ట్ లకు హరీష్ రావు నియామక పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 56కు చేరిందన్నారు మంత్రి హరీష్ రావు. 2014కు ముందు 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని... ప్రస్తుతం 82 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. త్వరలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. 

ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసియూలు 5 మాత్రమే ఉండేవని... ఇప్పుడు ఐసీయూల సంఖ్య 80కి చేరిందన్నారు మంత్రి హరీష్ రావు. పేదలపై సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మాతా, శిశుమరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. 108 అంబులెన్స్ ల సంఖ్య 450కి పెంచామన్నారు. ఇవాళ రాష్ట్రంలో 300 అమ్మఒడి వాహనాలు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతమేనని.. ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 76 శాతానికి పెరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. అవయవమార్పిడి శస్త్రచికిత్సలో తెలంగాణ ముందుందన్నారు. నిమ్స్ లో 6 నెలల్లో 100 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేశామని తెలిపారు. 

రూ. 30 లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఉచితంగా చేస్తున్నామని వెల్లడించారు. పిజి వైద్య సీట్లలో దేశంలో రెండోస్థానంలో చేరామన్నారు. వైద్యంలో నీతిఆయోగ్ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో మందులు లేవు.., ప్రైవేటులో కొనుక్కోండి అని చెప్పే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్య శాఖకు రూ. 12,364 కోట్లు కేటాయించామన్న మంత్రి.. నిమ్స్ ను 4వేల పడకలకు పెంచుకున్నామని తెలిపారు.