
- అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశం
- నష్టం జరిగాక కాదు.. ముందే స్పందించాలి
- వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే వారికి వేరేచోట ఇందిరమ్మ ఇండ్లు
- డిజాస్టర్ మేనేజ్మెంట్ బలోపేతానికి ఉన్నత స్థాయి కమిటీ
- వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వర్షకాలం నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టాలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి వరదల నివారణకు కార్యాచరణను ఈ నెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించిన నేపథ్యంలో గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, విపత్తుల నిర్వహణ విభాగాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ కమిటీలో హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖల కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు..
ఈ ఏడాది వర్షాకాలం 15 రోజులు ముందుగానే ప్రారంభమైనందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి, శాశ్వతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు నిర్వహణ, ముందస్తు హెచ్చరికల కోసం అవసరమైన యూజర్ ఐడీలను ఇవ్వాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆపద మిత్ర వలంటీర్లు, ఎన్డీఆర్ఎఫ్ (అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ), ప్రత్యేక పోలీస్ విభాగంలోని ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
బోట్లు, లైఫ్ జాకెట్లు రెడీగా ఉంచుకోవాలి
వరద నియంత్రణ కట్టలు, చిన్న, -మధ్య తరహా కాలువలు, వర్షపు నీటి డ్రైన్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రతి మండలానికి వరద ప్రతిస్పందన ప్రణాళికను సిద్ధం చేయాలని, బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర, పొడి ఆహార కిట్లు ముందే రెడీగా ఉంచాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హరీశ్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయతీరాజ్ కమిషనర్ సృజన, సీపీ డీసీఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్ గోపి, ఐఎండీ అధికారిణి నాగరత్నం, ఆదిలాబాద్, కొత్తగూడెం, గద్వాల, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.