శామీర్ పేట, వెలుగు: రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆఫీసులోనే ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. తర్వాత కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. గుం టూరు జిల్లా నీడబ్రోలుకు చెందిన మువ్వ రామ శేషగిరిరావు అనే వ్యక్తి శామీర్ పేట మండలం లాల్ గాడి మలక్ పేటలో 2006లో 29 ఎక రాలు కొనుగోలు చేశారు. కాగా.. భూమి పట్టా విషయంలో కోర్టులో కేసులు పడ్డాయి. 2013లో అవి క్లియర్ అయ్యాయి. రామ శేషగిరిరావుకు భూమికి చెందిన పట్టాదార్ పాస్ పుస్తకాలివ్వాలని సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు శామీర్ పేట తహసీల్దార్ సత్యనారాయణను ఆదేశించాయి.
కానీ.. ఆయన తనకు రూ.30 లక్షలు ఇస్తేనే పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తానని తేల్చి చెప్పాడు. దాంతో బాధిత రైతు నెల రోజుల కింద హైదరాబాద్ హోటల్ వద్ద రూ.10 లక్షలు ఇచ్చాడు. తర్వాత రూ.20 లక్షల చెక్కు కూడా అందజేశాడు. అయినా సత్యనారాయణ తృప్తి చెందక మరో 10 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధిత రైతు రామశేషగిరిరావు ఏసీబీని ఆశ్రయించారు. వాళ్లు మంగళవారం ప్లాన్ ప్రకారం రెడ్ హ్యాండెడ్గా సత్యనారాయణను పట్టుకున్నారు. అతని డ్రైవర్ బద్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.