మన పోలీసులకు జాతీయ అవార్డులు

మన పోలీసులకు జాతీయ అవార్డులు
  • దక్షత పతకం-2025 జాబితా ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్‌‌, వెలుగు: ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. స్పెషల్‌‌  ఆపరేషన్‌‌  ఫీల్డ్‌‌, ఇన్వెస్టిగేషన్‌‌  ఫీల్డ్‌‌, ఇంటెలిజెన్స్‌‌  ఫీల్డ్‌‌ కలిపి మూడు విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర హోం శాఖ ‘కేంద్ర గృహ మంత్రి దక్షత పతకం-2025’ జాబితాను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ డీకే ఘోష్‌‌  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

తెలంగాణ పోలీస్‌‌ శాఖలోని ఇంటెలిజెన్స్‌‌, కౌంటర్‌‌  ఇంటెలిజెన్స్‌‌, స్పెషల్‌‌  ఇంటెలిజెన్స్‌‌  బ్యూరోలో పనిచేస్తున్న అధికారులకు కూడా ఈ గౌరవం దక్కింది. ఇతర రాష్ట్రాలతో కలిసి యాంటీ టెర్రరిజం ఆపరేషన్లతో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ కౌంటర్‌‌  ఇంటిలిజెన్స్‌‌ (సీఐసెల్‌‌) కు చెందిన హెడ్‌‌ కానిస్టేబుళ్లు ఆకెపోగు లక్ష్మణరావు, గిబిమోన్‌‌  జాకబ్‌‌కు అత్యంత కీలకమైన స్పెషల్‌‌  ఆపరేషన్‌‌  ఫీల్డ్‌‌ విభాగంలో కేంద్రీయ గృహ మంత్రి దక్షత పతకం దక్కింది.