వేసవి విద్యుత్ డిమాండ్‌‌‌‌కు సన్నాహాలు

వేసవి విద్యుత్ డిమాండ్‌‌‌‌కు సన్నాహాలు

 హైదరాబాద్, వెలుగు: రాబోయే వేసవిలో విద్యుత్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని, డిస్కంలు ముందస్తుగా  సన్నాహాలు చేసుకోవాలని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ అధికారులను ఆదేశించారు. శనివారం మింట్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌లోని సదరన్ డిస్కం కార్పొరేట్ ఆఫీసులో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎనర్జీ సెక్రటరీ మిట్టల్ మాట్లాడుతూ గత వేసవిలో 17,162 మెగావాట్లకు గరిష్ట డిమాండ్‌‌‌‌ ఉన్నప్పటికీ ముందస్తు చర్యలతో సమస్యలు రాలేదని తెలిపారు. వచ్చే సమ్మర్ నాటికి గరిష్ట డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌‌‌‌ నాటికి విద్యుత్ లైన్ల రిపేర్లు, కొత్త ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. 

సదరన్​ డిస్కం పరిధిలో 72, నార్తర్న్ డిస్కం పరిధిలో 31 నూతన సబ్‌‌‌‌స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాన్స్‌‌‌‌కో పరిధిలోని 181ఈహెచ్​టీ సబ్‌‌‌‌స్టేషన్లలో పవర్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అదనంగా సదరన్ డిస్కంలో 8,384, నార్తర్న్ డిస్కంలో 5,280 డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన సేవలు అందించేందుకు ఎల్టీ/11 కేవీ స్థాయిలో ఆటోమేషన్‌‌‌‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రస్తుతం గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో మాత్రమే అమలవుతున్న స్కాడా సిస్టమ్‌‌‌‌ ను గ్రామాల వరకు విస్తరించాలని సూచించారు.