- 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు
- భారీగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
- నాలుగు జిల్లాల్లో 6 డిగ్రీల మేర నమోదు
- అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీలు రికార్డ్
- ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
- మరో మూడు నాలుగు రోజులు చలి మరింత తీవ్రమవుతుందని అధికారుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: చలితో రాష్ట్రం గజ గజ వణుకుతున్నది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే.. సెకండ్ వేవ్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. సాయంత్రం 6 గంటల నుంచే మొదలవుతున్న చలి.. మిట్టమధ్యాహ్నం 12 గంటల వరకూ వదలడం లేదు. సోమవారం రాత్రి 20 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదయ్యాయంటే చలి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 12.6 డిగ్రీల మధ్యే నమోదవడం గమనార్హం. నాలుగు జిల్లాల్లో 6 డిగ్రీలు, 2 జిల్లాల్లో 7 నుంచి 7.9, ఏడు జిల్లాల్లో 8 నుంచి 8.9, మరో ఏడు జిల్లాల్లో 9 నుంచి 9.9 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఐదు జిల్లాల్లో 10 డిగ్రీలు, ఇంకో 8 జిల్లాల్లో 11 నుంచి 12.6 డిగ్రీల మధ్య నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప రికార్డ్ నైట్ టెంపరేచర్ ఇదే. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉండగా.. అందులో 210కిపైగా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోనే నమోదయ్యాయి.
వణుకుతున్న ఏజెన్సీ, అటవీ ప్రాంతాలు..
రాష్ట్రంలో అటవీ ప్రాంతం ఎక్కువున్న ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 6.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డయింది. రంగారెడ్డి జిల్లా మంగళపల్లి (ఇబ్రహీంపట్నం)లో 7.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 7.9, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 8.1, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 8.2, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 8.4, మహబూబ్నగర్ జిల్లా సల్కార్పేటలో 8.6, రాజన్నసిరిసిల్ల జిల్లా మానాలలో 8.7, నారాయణపేట జిల్లా కోస్గిలో 8.9, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 9.1, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 9.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 9.5, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 9.5, నాగర్కర్నూల్ జిల్లా తోటపల్లిలో 9.6, కరీంనగర్ జిల్లా వెదురుగట్టులో 9.8, ములుగు జిల్లా మేడారంలో 9.9 డిగ్రీల మేర నైట్ టెంపరేచర్లు రికార్డయ్యాయి.
హైదరాబాద్ లో హెచ్ సీ యూ వద్ద 8 డిగ్రీలు..
జీహెచ్ఎంసీ పరిధిలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ వద్ద అత్యల్పంగా 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాజేంద్రనగర్లో 8.5, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ వద్ద 9.4 డిగ్రీల మేర నైట్టెంపరేచర్లు నమోదయ్యాయి. గచ్చిబౌలిలో 10.8, శివరాంపల్లిలో 10.9 చొప్పున నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. అయితే, చలి తీవ్రత రాబోయే మూడు రోజులు మరింత పెరిగే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే ముప్పు ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో ఐదు డిగ్రీలకన్నా తక్కువకు పడిపోయే ముప్పు ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సిటీలోనూ 6 డిగ్రీల వరకు టెంపరేచర్లు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. చలి ప్రభావం పెరుగుతుండడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున బయటకు వెళ్లేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, ఆస్తమా, గుండె జబ్బులు, ఉబ్బసం సంబంధిత జబ్బులున్న వాళ్లు బయటకు వెళ్లకుండా ఉండాలని, చలి నుంచి కాపాడుకునేలా వెచ్చని దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు.

