- క్రీడాభివృద్ధికి రూ.1,575 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
- క్రీడలే జీవితం అనుకునే వారికి ప్రభుత్వం తోడుంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో మరిన్ని మెడల్స్ సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రత్యేక ప్రణాళికలపై క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
బుధవారం గ్లోబల్ సమ్మిట్ 2025లో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ ప్యానెల్ డిస్కషన్ జరిగింది. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పొర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఒలింపిక్ స్టార్ పీవీ సింధు, బ్యాడ్మింటన్ చాంపియన్లు పుల్లెల గోపీచంద్, గుత్తా జ్వాలా, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, మంత్రి మహ్మద్ అజారుద్దీన్, అంబటి రాయుడు, స్పెషల్సీఎస్ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచం మీవైపు చూసేలా చేస్తం: మంత్రి శ్రీహరి
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ “ఆటలే జీవితం అనుకునే వారికి ప్రభుత్వం తోడుంటుంది. గ్రామాల నుంచి ఒలింపిక్ చాంపియన్లను తయారు చేస్తాం. గతంలో పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు దండించేవారు. నేడు ఆడుకోవాలని ప్రోత్సహిస్తున్నరు. ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి ఎంపిక చేసి క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నది. ఆటలే సర్వస్వం అని ఆడండి ప్రపంచం మీవైపు చూసే విధంగా మా ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది” అని అన్నారు.
ఉప్పల్ స్టేడియంను పరిశీలించిన మంత్రి
ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లయనల్ మెస్సీ, సీఎం రేవంత్రెడ్డి మధ్య ఈ నెల 13న జరగనున్న ఫుట్బాల్ మ్యాచ్ఏర్పాట్లను బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. ఉప్పల్ స్టేడియం అంతటా తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యాచ్ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

