మల్లు స్వరాజ్యం, జనార్దన్‌‌‌‌ రెడ్డిలకు అసెంబ్లీ సంతాపం 

మల్లు స్వరాజ్యం, జనార్దన్‌‌‌‌ రెడ్డిలకు అసెంబ్లీ సంతాపం 

ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డిల మృతికి శాసన సభ్యులు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో వారు చేసిన సేవలను అసెంబ్లీ కొనియాడింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించింది. 

మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978 నుంచి 1983 వరకూ, 1983 నుంచి 1984 వరకూ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారని స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి గుర్తు చేశారు. 1945 నుంచి 1948 వరకూ జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొట్టమొదట మహిళ  మల్లు స్వరాజ్యం అని గుర్తు చేశారు. 1981 నుంచి 2002 వరకూ ఆంధ్రప్రదేశ్​ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని, ఆ సంఘానికి అధ్యక్షురాలిగా కూడా పని చేశారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లో 1993 సంవత్సరంలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధం ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. 2022 మార్చి 19వ తేదీన మల్లు స్వరాజ్యం మరణించారని తెలిపారు. 

పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డి మృతికి సంతాపం 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరీంనగర్​ జిల్లా కమలాపూర్​ నియోజకవర్గం నుంచి పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డి.. 1972 నుంచి 1978 వరకు, 1978 నుంచి1983 వరకూ ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు అందించారని స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 1959 నుంచి 1971 వరకు హుజురాబాద్​ సమితి అధ్యక్షుడిగా పని చేశారని చెప్పారు. జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారని గుర్తు చేశారు. లెప్రా సొసైటీలో సభ్యుడైన పరిపాటి జనార్థన్​ రెడ్డి.. 1968లో కుష్ఠు నివారణ సమితిని స్థాపించి.. వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. 1974 సంవత్సరంలో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగంలో ప్రజలకు సేవలందించారని అన్నారు.  2022, మార్చి 28న 87 సంవత్సరాల వయసులో పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డి మరణించారు. 

సభలో 2 నిమిషాల మౌనం
ఎమ్మెల్యేలందరూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డిల మృతి పట్ల సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.  ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. 
సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం
సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి..? ఏయే అంశాలపై చర్చించాలి..? వంటి అంశాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. సభకు సీఎం కేసీఆర్‌, మంత్రులతో పాటు సభ్యులు హాజరుకానున్నారు.