తెలంగాణ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ సవరణ..మెడికల్ కాలేజీల్లో మన విద్యార్థులకే అధిక సీట్లు

 తెలంగాణ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ సవరణ..మెడికల్ కాలేజీల్లో మన విద్యార్థులకే అధిక సీట్లు

వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. AP  రీఆర్గనైజషన్ యాక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ ను ప్రభుత్వం సవరించింది. దీని ప్రకారం, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. వారు కూడా ఎంబిబిఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. 

తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. అయితే  తెలంగాణ ఏర్పాటుకు ముందు  20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటాగా 280  సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది.

Also Read : హెల్త్ అల‌ర్ట్.. క‌రోనా త‌ర్వాత పిల్ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఎక్కువ‌గా వ‌స్తుంది

ఇదే విధానం కొనసాగితే  పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం  అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది.  కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా  సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభించనున్నాయి. ఇప్పటికే ఎంబిబిఎస్  బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు పొందుతున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినా కొద్దీ  ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుంది. కొత్త మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోట 15% సీట్లు యధాతదంగా ఉంటాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.