టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో ప్రజల ఖాతాలోని డబ్బును మాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలిస్ ప్రజలందరికీ ఒక విన్నపం చేసింది. ఆన్ లైన్ మోసాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచనలిచ్చింది.
- ఎట్టిపరిస్థితుల్లో డెబిట్/క్రెడిట్ కార్డ్ రెస్టారెంట్లు, బార్లలో, పెట్రోల్ బంకుల్లో ప్రక్కకు తీసుకెళ్లి స్వైప్ చేస్తాము అంటే ఎవరి చేతికి ఇవ్వొద్దు.
- అలా వారి చేతికి ఇవ్వడం వల్ల మన కార్డ్ ను సైబర్ నేరగాళ్లు డూప్లికేట్ (క్లోనింగ్) చేసి వాడుకునే అవకాశం ఉంది.
- మీకు మాత్రమే తెలిసి ఉండాల్సిన ఏటిమ్ పిన్ ఎవరికీ చెప్పకండి, రహస్యంగా ఉంచండి.
- మీ కార్డ్ ని మీ కళ్ళముందే స్వైప్ చేసేలా చూసుకోండి.
- కార్డ్ పై ఉన్న 16 అంకెలు, గడువు తేదీ, కార్డ్ వెనుక ఉన్న 3 అంకెల సీవివి నెంబర్ అపరిచితులు కంట పడకుండా చూసుకోండి.
- వీలైతే CVV నెంబర్ ని చెరిపేసి గుర్తుపెట్టుకోండి. తరుచూ పిన్ నెంబర్ మార్చుతూ ఉండండి.